మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ల మాదిరిగా మహారాష్ట్రలో బిజెపి ఆటలు సాగవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు.
ముంబై: మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ల మాదిరిగా మహారాష్ట్రలో బిజెపి ఆటలు సాగవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. నిజంగా భారతీయ జనతా పార్టీకి దమ్ముంటే తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాలంటూ సవాల్ విసిరారు. అది సాధ్యం కాదనే వారు మా జోలికి రావడంలేదని అన్నారు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపి ల సంకీర్ణ ప్రభుత్వం పూర్తి పదవికాలం కొనసాగుతుందని... బిజెపితో తమ ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని ఉద్దవ్ వెల్లడిచారు.
ఇప్పటికే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బిజెపి అధికారాన్ని చేపట్టింది. అదే బాటలో రాజస్థాన్ రాజకీయాలు కూడా సాగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు సచిన్ ఫైలట్ తన ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరవేశాడు. దీంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థిలో వుంది. ఈ రాజకీయ పరిణామాలపై శివసేన అధికారిక పత్రిక 'సామ్నా' ద్వారా స్పందించిన ఉద్దవ్ పై వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇండియా-చైనా సంబంధాలపైనా ఉద్దవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలోనే చైనాను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని... అయితే భవిష్యత్ లో ఈ పరిస్థితి వుండకపోవచ్చని అన్నారు. భారత్-చైనాలు రాబోవు రోజుల్లో మిత్రదేశాలుగా మారే అవకాశం వుందన్నారు. కాబట్టి అంతర్జాతీయ సంబంధాల విషయంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీతో వుండాలని ఉద్దవ్ సూచించారు.