
ముంబయి: మహారాష్ట్ర మంత్రి దాదా భూసే సోమవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉల్లి ధరలు పెరుగుతాయనే ఆందోళనలతో ఎగుమతులపై పన్ను పెంచిన నేపథ్యంలో ఓ నాలుగు నెలలు ప్రజలు ఉల్లి తినకుంటే కొంపలేమీ కూలిపోవన్నట్టుగా కామెంట్ చేశారు.
ఆగస్టు 19వ తేదీన ఉల్లి ఎగుమతులపై 40 శాతం పన్నును కేంద్ర ప్రభుత్వం విధించింది. తద్వారా ఎగుమతులకు అడ్డుకట్ట వేసి దేశీయంగా వీటి లభ్యత పెంచేలా ఈ చర్యలు తీసుకుంది. ఉల్లి ధరలు పెరుగుతాయనే సంకేతాలు, త్వరలో పండుగ సీజన్ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, ఈ నిర్ణయంపై ఉల్లి రైతులు భగ్గుమన్నారు. ఎగుమతులపై పన్ను విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఉల్లి ఎగుమతులపై ఇలా పన్ను విధించడం ఇదే తొలిసారి. కస్టమ్స్ నోటిఫికేషన్ రూపంలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ పన్ను విధించింది. ఈ పన్ను డిసెంబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. అయితే.. ఈ నిర్ణయాన్ని ఉల్లి రైతులు వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి దాదా భూసే సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రూ. 10 లక్షల విలువైన వాహనాన్ని నువ్వు వాడుతున్నట్టుప్పుడు ఉల్లికి రిటేల్ ధర కంటే రూ. 10 లేదా రూ. 20 పెరిగినప్పుడు వాటిని కొనుగోలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అదే.. ఉల్లిగడ్డలను కొనే సామర్థ్యం లేనివారు.. ఒక రెండు నుంచి నాలుగు నెలలు ఉల్లి వాడకుంటే పోయేదేమీ ఉండదు’ అని మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి కామెంట్ చేశారు.
Also Read: దారుణం.. బిర్యానీ ఆర్డర్ కోసం 22 ఏళ్ల యువకుడిపై తాగుబోతుల దాడి.. వేటకొడవళ్లతో నరికి హత్య..
అంతేకాదు, ఉల్లి ఎగుమతులపై పన్ను విధించే నిర్ణయాన్ని అందరినీ సమన్వయం చేసుకుని తీసుకోవాల్సిందని మంత్రి అన్నారు. ‘కొన్ని సార్లు ఉల్లి ధరల క్వింటల్కు రూ. 200 ఉంటే.. మరికొన్ని సార్లు రూ. 2,000 దాకా ఉంటుంది. అందుకే ఒక సామరస్య పూర్వకమైన చర్చ చేస్తే సమ్మతమైన పరిష్కారం దొరుకుతుంది’ అని పేర్కొన్నారు.