
ఢిల్లీ : బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని భావించిన కాంగ్రెస్కు మాయావతి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. కొందరు కాంగ్రెస్ నేతలు అహంకారపూరితంగా వ్యవహరించినందువల్లే గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారానికి దూరమైందంటూ మాయావతి ఘాటుగా విమర్శించారు.
బీజేపీని గద్దెదించేందుకు సరైన కూటమిని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని మాయావతి ఆరోపించారు. అసలు బీజేపీని ఓడించాలనే ఉద్దేశం వారికి ఉందో లేదోనన్న విషయంపై స్పష్టత లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందువల్లే కర్ణాటక, చత్తీస్గఢ్ ఎన్నికల్లో దూరంగా ఉన్నామని స్పష్టం చేశారు. చిన్న పార్టీలను పూర్తిగా నామరూపాల్లేకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలను విమర్శించిన మాయావతి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలపై మాత్రం ప్రశంసలు కురిపించారు. మాతో పొత్తు విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు సానకూల వైఖరితోనే ఉన్నారు. బీఎస్పీతో పొత్తుకు ముందు నుంచీ వారు నిజాయితీగానే ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
మరోవైపు తన తమ్ముడిపై సీబీఐ విచారణ జరుగుతుందన్న భయంతోనే మాయవతి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అందుకే ఆమె కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం లేదంటూ విమర్శించారు. కాగా దిగ్విజయ్ వ్యాఖ్యల్ని ఖండించిన మాయావతి డిగ్గీ బీజేపీ ఏజెంట్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.