Waste-wise cities: వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో దేశంలోని 28 నగరాలు బెస్ట్.. జాబితాలో ఏపీలోని మూడు నగరాలు..

By Sumanth KanukulaFirst Published Dec 7, 2021, 4:10 PM IST
Highlights

భారత్‌లోని నగరాల్లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఉత్తమ విధానాలు, ఘన వ్యర్థాలను ఎలా నిర్వహిస్తున్నాయనే దానిపై నీతి ఆయోగ్ (NITI Aayog), సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) సంయుక్తంగా సమగ్ర రిపోర్ట్‌ను రూపొందించాయి. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో (municipal solid waste management) దేశంలోని 28 నగరాలు ఉత్తమ పద్ధతులను అనుసరిస్తున్నట్టుగా పేర్కొన్నాయి.
 

భారత్‌లోని నగరాల్లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (municipal solid waste management) ఉత్తమ విధానాలు, ఘన వ్యర్థాలను ఎలా నిర్వహిస్తున్నాయనే దానిపై నీతి ఆయోగ్ (NITI Aayog), సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) సంయుక్తంగా సమగ్ర రిపోర్ట్‌ను రూపొందించాయి. ఈ రిపోర్ట్‌ను నీతి ఆయోగ్ వైఎస్ చైర్ పర్సన్ రాజకీయ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్, ప్రత్యేక కార్యదర్శి కె రాజేశ్వరరావు, సీఎస్‌ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నరైన్ (Sunita Narain) డిసెంబర్ 6వ తేదీన  విడుదల చేశారు. భారతదేశ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగం గత కొన్ని సంవత్సరాలలో అసమానమైన వృద్ధిని సాధించిందని నివేదికలో పేర్కొన్నారు. భారత్‌ను మరింతగా శుభ్రత వైపుగా నడిపించేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ రెండోవ దశ ప్రారంభించబడిందన్నారు.

“వేస్ట్-వైజ్ సిటీస్: బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్” పేరుతో రూపొందించబడిన నివేదిక.. భారత దేశంలోని 15 రాష్ట్రాల్లోని 28 నగరాలు ఉత్తమ పద్ధతులను అనుసరిస్తున్నట్టుగా గుర్తించింది. నీతి ఆయోగ్, CSE సంయుక్తంగా దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించాయి. ఇందుకోసం జూలై 2021 నుంచి ఐదు నెలల పాటు విస్తృతంగా క్షేత్ర స్థాయిలో పలు అంశాలను పరిశీలించారు. మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి సస్టైనబుల్ వాల్యూ చైన్‌ను వివరించే 10 విభిన్న అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. 

వ్యర్థ పదార్థాల నిర్వహణలో అత్యుత్తమ విధానాలు అనుసరిస్తున్న 28 నగరాల విషయానికి వస్తే.. లడఖ్‌లోని లేహ్, కేరళలోని అలప్పుజా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, ఒడిశాలోని దెంకనల్, సిక్కింలోని గ్యాంగ్‌టక్, గుజరాత్‌లోని సూరత్.. నగరాలు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు నగరాలు కూడా నిలిచాయి. బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌‌ విభాగంలో విజయనగరం జిల్లాలోని బొబ్బలి (Bobbili), టెక్నాలాజికల్ ఇన్నోవేషన్ విభాగంలో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ (Kakinada), కృష్ణా జిల్లాలోని విజయవాడ‌లకు (Vijaywada) చోటుదక్కింది.

ఈ సందర్బంగా డాక్టర్ రాజీవ్ కుమార్ (Dr Rajiv Kumar) మాట్లాడుతూ.. ‘భారత అభివృద్ధి భవిష్యత్తును పరిశీలిస్తే.. పట్టణీకరణ కీలకం కాబోతోంది. నగరాలు ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా మారతాయి. నగరాల్లో సమర్థవంతమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలను అమలు చేయడం చాలా ముఖ్యం. స్వచ్ఛత కోసం జన్ ఆందోళన్ చాలా అవసరం. ఇందులో పాల్గొనే ప్రజలు..  వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించిన ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. వ్యర్థాలను అత్యున్నత శక్తిగా మార్చడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి’ అని అన్నారు.

అమితాబ్ కాంత్ (Amitabh Kant) మాట్లాడుతూ.. ‘ఘన వ్యర్థాల సమర్ధవంతమైన నిర్వహణ.. వేగవంతమైన పట్టణీకరణ సాధిస్తున్న భారతదేశానికి ప్రధాన సవాలుగా ఉంటుంది. వ్యర్థాల నిర్వహణలో మూలాల విభజనను ప్రోత్సహించడంతో పాటు అవసరమైన నియమాలు, నిబంధనలతో పాటు సర్క్యులారిటీ ఆవశ్యకత అవసరం ఉంటుంది’ అని చెప్పారు. 

డాక్టర్‌ కె. రాజేశ్వరరావు (K Rajeswara Rao) మాట్లాడుతూ..  ‘దేశంలోని 28 నగరాల వ్యర్థాల నిర్వహణలో విశేషమైన పురోగతిని సాధించిన విజయగాథలను సంకలనం చేస్తూ ఈ పుస్తకం తీసుకొచ్చినట్టు చెప్పారు. ఇందులో చాలా విలువైన విషయాలు ఉన్నారు. దేశంలోని పట్టణ, స్థానిక సంస్థలు వ్యర్థ పదార్థాల నిర్వహణ సేవా గొలుసులోని వివిధ భాగాలకు సంబంధించిన వ్యూహాలను ప్రదర్శించే విజ్ఞాన వనరులకు ప్రాప్యత కలిగి ఉండాలి’ అని చెప్పారు. 

సునీతా నరైన్ మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 1, 2021న ప్రారంభించబడిన స్వచ్ఛ్ భారత్ మిషన్ (SBM) 2.0.. ఇప్పుడు నగరాల్లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం ఒక స్పష్టమైన వ్యూహంపై ఆధారపడి ఉంది. ఇది మూలాన్ని కేంద్రీకరించే వ్యూహం. ఇందులో విభజన, మెటీరియల్ రీప్రాసెసింగ్ జీరో-ల్యాండ్‌ఫిల్‌లు ఉంటాయి. ఈ మార్పును గుర్తించి.. వ్యర్థాలు కలుషితం కాకుండా, ప్రజారోగ్యానికి ముప్పుగా మారకుండా ప్రచారం చేయాలి. వ్యర్థాలు తిరిగి వినియోగించుకునేలా, రీసైకిల్ చేయడానికి ఒక వనరుగా మారాలి’ అని తెలిపారు. ఇక, రాజేశ్వరరావుతో కలిసి సునీతా నరైన్ ఈ పరిశోధనను పర్యవేక్సించారు.

click me!