కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ బృహత్తర కార్యక్రమం కోసం దేశంలోని పలు ప్రఖ్యాత ప్రాంతాల నుంచి ఇసుక, మార్బుల్స్, కలప వంటి మెటీరియల్ను తెప్పించారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో అధ్యాయం మొదలుకాబోతోంది. అన్ని హంగులతో , ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కొందరు విపక్ష నేతలు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగం ప్రకారం .. ప్రధాని మోడీ శాసన వ్యవస్థలో భాగం కాదని, ఆయన కార్యనిర్వాహక వ్యవస్థకు చెందిన వ్యక్తని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి ప్రారంభిస్తేనే ఈ కార్యక్రమానికి తాము హాజరవుతామని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి.
ఈ సంగతి పక్కనబెడితే.. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించాలన్న ఉద్దేశ్యమే ఒక బృహత్తర ప్రయత్నం. దీని నిర్మాణంలో దేశం నలుమూలల నుంచి లభించిన మెటీరియల్ను ఉపయోగించారు. ఒక విధంగా, ప్రజాస్వామ్య దేవాలయాన్ని నిర్మించడానికి దేశం మొత్తం ఏకతాటిపైకి రావడానికి ఇది నిదర్శనంగా నిలిచింది. తద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క నిజమైన స్ఫూర్తిని చాటుతుంది. కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం, ప్రారంభోత్సవంలో అనేక వింతలు, విశేషాలు, ప్రత్యేకతలు వుండేలా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న రాజదండం (సెంగోల్) ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచింది.