
Sanjay Raut: దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యేక ఫ్రంట్ ఏర్పాటు దిశగా రాజకీయాలు కదులుతున్నాయి. దీని కోసం ఇప్పటికే కాంగ్రెస్ ను కాదని మరో ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసే దిశగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం బీజేపీకి వ్యతిరేకంగా ఇతర రాజకీయ పార్టీలను ఏకం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికే దేశంలోని బీజేపీయేతర పలువురు ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. ఇదే విషయంపై చర్చించారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే శివసేన నాయకుడు, పార్లమెంట్ సభ్యులు సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్న ఆయన.. తెలంగాణ సీఎం కేసీఆర్కు అందరిని కలిపి ముందుకు నడిపించే సత్తా ఉన్న నాయకత్వ సామర్థ్యం ఉందని వెల్లడించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో సీఎం కేసీఆర్.. పలువురు నేతలతో కలిసి సమావేశమయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు కాబోయే ప్రతిపక్ష ఫ్రంట్ గురించి చర్చించారు. ఈ సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సోమవారం నాడు సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిపి అధికారాన్ని పంచుకుంటున్న శివసేన.. బీజేపీని ఎదుర్కొవడానికి ప్రత్యేక ఫ్రంట్ గురించి గతేడాది తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడారని తెలిపారు. కాంగ్రెస్ లేకుండా రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు గురించి టీఎంసీ మాట్లాడితే.. కాంగ్రెస్ ను కలిసే ముందుకు సాగాలని సూచించామని తెలిపారు. "కాంగ్రెస్ లేకుండా రాజకీయ ఫ్రంట్ ఏర్పడుతుందని మేము ఎప్పుడూ చెప్పలేదు. మమతా బెనర్జీ రాజకీయ ఫ్రంట్ను సూచించిన సమయంలో, కాంగ్రెస్ను వెంట తీసుకెళ్లాలని మాట్లాడిన మొదటి రాజకీయ పార్టీ శివసేన" అని సంజయ్ రౌత్ అన్నారు.
గత ఏడాది డిసెంబర్లో, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ.. కాంగ్రెస్ను మినహాయించి రాజకీయ పొత్తు గురించి ఆలోచిస్తున్నట్లు సంజయ్ రౌత్ చెప్పారు. అయితే, దేశంలో చాలా కాలం నుంచి ఉన్న జాతీయ రాజకీయాలను కాదని.. బీజేపీకి వ్యతిరేకంగా.. యూపీఏకు సమాంతరంగా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయడమనేది అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని, "ఫాసిస్ట్" శక్తులను బలోపేతం చేయడమేనని శివసేన నేత పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ)ని కోరుకోని వారు వెనుకు రాజకీయాలు చేసే బదులు.. గందరగోళాన్ని సృష్టించడం మాని బహిరంగంగా తమ వైఖరిని స్పష్టం చేయాలని శివసేన పేర్కొంది.
ఇదిలావుండగా, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ, ప్రధాని మోడీ లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దేశం నుంచి బీజేపీ తరిమి కొట్టాలనీ, దీని కోసం దేశంలోని శక్తులన్ని ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలతో ఆయన సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్పై చర్చించడానికి ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో సమావేశమైన పలు విషయాలపై చర్చించారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై వ్యతిరేకతను బలోపేతం చేసే ప్రచారంలో భాగంగానే ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించామని తెలిపారు. త్వరలో హైదరాబాద్లో అందరం కలిసి .. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు.