
కేరళ రాష్ట్రాన్నిభారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఒక్క కేరళను మాత్రమే కాదు.. కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు కూడా వరదల కారణంగా జలమయమయ్యాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో... అక్కడి ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే.. ఈ విషయంలో కాంగ్రెస్ మహిళా నేత, నటి రమ్యపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇంతకీ మ్యాటరేంటంటే.. కాంగ్రెస్ నేతగా పార్టీకి సంబంధించిన అని విషయాల్లో రమ్య చురుకుగా వ్యవహరిస్తుంటారు. కాగా.. గత కొంతకాలంగా ఆమె కనిపించడం లేదు. తన సొంత రాష్ట్రం కర్ణాటక లో వరదలు బీభత్సం సృష్టించినప్పటికీ.. ఆమె ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించలేదు. బాధితులను పరామర్శించిందీ లేదు. సడన్ గా నటి రమ్యకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది కాలంగా కనిపించని రమ్య ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు జర్మనీ పర్యటనలో రమ్య కనిపించడం విశేషం.
ఆమెతో పాటు కాంగ్రెస్ నేత మిలింద్ దియోరా కలిసి తీయించుకున్న ఫొటోతో పాటు కర్ణాటక ఇన్చార్జిలలో ఒకటైన మధుయాష్కి గౌడతో కూడా రమ్య దిగిన ఫొటో వైరల్ అవుతోంది. రాష్ట్రంలోని కొడగు జిల్లా భారీ వర్షాలు, వరదలతో అట్టుడికిపోయి ప్రజలు హాహాకారాలు చేస్తుంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన రమ్యకు విదేశాలకు వెళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అని పలువురు నెటిజన్లు చురకలంటించారు.