
ముంబయి: మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం పురుడుపోసుకున్నట్టు తెలుస్తున్నది. ఆ రాష్ట్రంలో ఎన్సీపీకి విశిష్టమైన గుర్తింపు ఉన్నది. ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ను అధికార, ప్రతిపక్షాలు అంచనా వేయలేవనే వాదన ఉన్నది. తాజాగా, మరోసారి ఆ వాదనను నిజం చేస్తున్నారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ) నుంచి ఎన్సీపీ బయటకు వచ్చిందా? అనే చర్చ మొదలైంది. బీజేపీతో దోస్తి కలిసినట్టూ రాజకీయ శ్రేణులు చెబుతున్నాయి.
మహారాష్ట్రలో ఒక రైట్ వింగ్ పార్టీని, కాంగ్రెస్ను ఏకతాటిమీదికి తెచ్చి మహా వికాస్ అఘాదీ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఘనత శరద్ పవార్కు దక్కుతుంది. మొన్న మొన్నటి వరకు ఎంవీఏను శరద్ పవార్ బలంగానే ఉంచగలిగారు. కానీ, మొన్న అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు అక్కర్లేదని బహిరంగంగా వ్యాఖ్యానించి అన్ని వర్గాలను విస్మయానికి గురి చేశారు. ఈ కామెంట్తో ప్రతిపక్షాల్లో సఖ్యత కొరవడుతున్నదనే సంకేతాలు వచ్చాయి. ఎందుకంటే అదానీ పై జేపీసీ విచారించాలని ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా డిమాండ్ చేశాయి.
ఈ సంకేతాలను మరింత బలపరిచేలా తాజా విషయం ఒకటి బయటకు వచ్చింది. మహారాష్ట్రలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే బాజార్ కమిటీ ఎన్నికల్లో ఎన్సీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయనే వార్త హాట్ టాపిక్గా మారింది. ఏపీఎంసీ కింద 1963లో ఈ మార్కెటింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. రైతులకు మార్కెట్లో మంచి ధర దక్కేలా, వారికి వసతులు ఉండేలా ఈ కమిటీ చూసుకుంటుంది. మొత్తం 305 మార్కెట్ కమిటీలకు గాను 258 కమిటీలకు ఎన్నికలను ప్రకటించారని ఓ కాంగ్రెస్ నేత తెలిపారు. ఇందులో 150కి పైగా కమిటీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్సీపీ పోటీ చేస్తున్నట్టు తమకు తెలిసిందని వివరించారు. ఇది అభ్యంతరకరం అని పేర్కొన్నారు.
Also Read: ఈసీ సవరణ తర్వాత జాతీయ పార్టీల జాబితా ఇదే.. జాతీయ హోదా పొందాలంటే అర్హతలేమిటంటే?
ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, సోమవారం సమావేశమై దీనిపై చర్చిస్తామని కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ నానా పటోలే అన్నారు. శరద్ పవార్కు అదానీతో సత్సంబంధాలున్నాయని, కాబట్టి, జేపీసీ విచారణ చేయాలని రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ నుంచి ఆయన వైదొలగడాన్ని తాము తప్పుగా తీసుకోవడం లేదని వివరించారు.
ఈ పరిణామాలు రాష్ట్రంలో ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్లతో ఎన్సీపీ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.