
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రెండు రోజు పర్యటన నిమిత్తం ఆదివారం హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో నవీన్ పట్నాయక్కు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. నవీన్ పట్నాయక్ నేడు (అక్టోబర్ 17) హైదరాబాద్లో జరిగే ఒడిశా ఇన్వెస్టర్స్ మీట్లో పాల్గొననున్నారు. ఈ మీట్లో నవీన్ పట్నాయక్తో పాటు.. ఒడిశా ముఖ్య అధికారులు కూడా పాల్గొంటారు. ఈ మీట్లో నవీన్ పట్నాయక్.. పెట్టుబడిదారులతో ఇంటరాక్ట్ కానున్నారు. అలాగే నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4 వరకు ఒడిశాలో జరగనున్న మూడో ‘మేక్-ఇన్-ఒడిశా’ కాన్క్లేవ్కు సంబంధించిన ఈ మీట్లో పాల్గొన్నవారికి తెలియజేయనున్నారు.
బంజారాహిల్స్లోని హోటల్ తాజ్ కృష్ణలో పెట్టుబడిదారులతో నవీన్ పట్నాయక్ వన్ టు వన్ సమావేశం కానున్నారు. ఒడిశాలోని విభిన్న వ్యాపార అనుకూల పర్యావరణ వ్యవస్థ గురించి వారికి తెలియజేస్తారు. ఐటీ, విద్యుత్తు, చేనేత, మైనింగ్, మిషనరీ, ఉక్కు, అల్యూమినియం, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులపై పెట్టుబడిదారులతో నవీన్ పట్నాయక్ చర్చించనున్నారని ఒడిశా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇక, ఒడిశా ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) సహకారంతో ఒడిషా పెట్టుబడిదారుల సమావేశాన్ని నిర్వహిస్తోంది. గతంలో దుబాయ్, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరులలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశాల్లో సీఎం నవీన్ పట్నాయక్ పాల్గొన్నారు.
అయితే ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరుకావడానికి సైఫాయ్కు వెళ్లిన కేసీఆర్.. అటు నుంచి ఢిల్లీ వెళ్లారు. గత కొద్ది రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే నవీన్ పట్నాయక్ను కలిసేందుకు కేసీఆర్ సోమవారం హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందనే టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే దీనిపై సీఎంవో వర్గాల నుంచి మాత్రం ఎటువంటి స్పష్టత లేదు.