
గతేడాది డిసెంబర్ 4వ తేదీన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన నాగాలాండ్ పౌర హత్యల కేసులో పోలీసులు 30 మంది ఆర్మీ సిబ్బందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఘటనలో 13 మంది సాధారణ పౌరులు హత మయ్యారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన కేసును విచారిస్తున్న సిట్ దాఖలు చేసిన చార్జిషీట్లో ఓ ఆర్మీ అధికారి, 29 మంది జవాన్ల పేర్లు ఉన్నాయి.
గతేడాది మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామానికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. బొగ్గు గనిలో పని చేసిన తర్వాత వారంతా పికప్ వ్యాన్ లో తిరిగి వస్తున్నారు. అయితే వారంతా మిలిటెంట్లుగా భావించి 21 పారా స్పెషల్ ఫోర్సెస్ యూనిట్ కాల్పులు జరిపింది. దీంతో 13 మంది చనిపోయారు.ఈ ఘటన బయటకు పొక్కడంతో ఆ గ్రామస్తులు అక్కడికి చేరుకుని పదునైన ఆయుధాలతో సైనికులపై దాడి చేశారు. ఈ దాడిలో ఒక కానిస్టేబుల్ చనిపోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
కోవిడ్తో భర్త దూరం.. అయినా జ్ఞాపకాలు పదిలం, లాకెట్లో ఆయన అస్థికలు పెట్టుకున్న భార్య
దీనిపై నాగాలాండ్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విచారణ సాగించిన సిట్ తాజాగా సైనికులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే చార్జిషీట్లో పేర్కొన్న జవాన్లపై చర్యలు తీసుకునేందుకు నాగాలాండ్ ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతి కోరింది. చర్యకు అనుమతి కోరుతూ రాష్ట్ర పోలీసులు రక్షణ మంత్రిత్వ శాఖకు లేఖ కూడా పంపారు. కాగా ఆర్మీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో భాగమైన ప్రత్యేక ఆర్మీ బృందం కూడా ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. మేజర్ జనరల్ నేతృత్వంలోని కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ బృందం ఇప్పటికే ఓటింగ్ గ్రామాన్ని సందర్శించి సంఘటన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి స్థలాన్ని పరిశీలించింది.
వాస్తవానికి ఆ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో అమలులో ఉన్న AFSPA (సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం) నాగాలాండ్ లో కూడా అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారం సైనిక బలగాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అంటే మిలిటెంట్లుగా భావించే ఎవరినైనా కాల్చి చంపినట్లయితే వారికి అరెస్టు, ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపు ఉంటుంది. అలాగే ఎలాంటి ముందస్తు వారెంట్ లేకుండానే ఆపరేషన్లు నిర్వహించడానికి, ఎవరినైనా అరెస్టు చేయడానికి అధికారం ఉంటుంది. ఈ అధికారాల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపణ ఉంది.
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. దూరంలో ఉన్న మిత్రుడికి లైవ్ స్ట్రీమ్ పెట్టిన దుండగులు
ఈ ఘటన చోటు చేసుకున్న తరువాత ఈశాన్య రాష్ట్రాల్లో AFSPA రద్దు చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనలు చెలరేగాయి. ఈ విషయంలో ఆయా రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు దఫాలుగా చర్చలు జరిపారు. దీంతో ఆ చట్టం పరిధిని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అమిత్ షా ఈ ఏడాది మార్చ్ 31వ తేదీన ప్రకటించారు. అస్సాం, మణిపూర్, నాగాలాండ్లలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) పరిధిలోని ప్రాంతాలను తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు.