
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ చరిత్ర సృష్టించింది. రాష్ట్ర హోదా పొందిన 60 ఏళ్లలో తొలిసారిగా ఓ మహిళ నాగాలాండ్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. బీజేపీ మిత్రపక్షం ఎన్డీపీపీకి చెందిన హెకానీ జఖాలు దిమాపూర్ 3 స్థానం నుంచి విజయం సాధించారు. నాగాలాండ్ అసెంబ్లీకి పోటీ చేసిన మొత్తం 183 మంది అభ్యర్ధుల్లో నలుగురు మహిళలు కూడా వున్నారు. వీరిలో 48 ఏళ్ల హెకానీ.. లోక్ జనశక్తి పార్టీకి చెందిన అజెటో జిమోమిని ఓడించారు. మరో మహిళా అభ్యర్ధి సల్హౌటు యోనువో క్రూస్ కడపటి వార్తలు అందేసరికి ఆధిక్యంలో వున్నారు. ఈమె పశ్చిమ అంగామి స్థానం నుంచి ఎన్డీపీపీ పార్టీ నుంచి బరిలో నిలిచారు.
నాగాలాండ్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి గురువారం ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. అధికార ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 30 స్థానాల్లో విజయం సాధించి, మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచి మరోసారి అధికారాన్ని అందుకోనుంది. ముఖ్యమంత్రి నేపియు రియో నేతృత్వంలోని నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ 2018 నుంచి బీజేపీతో పొత్తులో వుంది. గత ఎన్నికల్లో ఈ కూటమి 30 స్థానాల్లో విజయం సాధించగా.. ఎన్పీఎఫ్ 26 స్థానాల్లో గెలిచింది.
ALso REad: నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు.. ఐదు స్థానాల్లో ఎన్డీపీపీ-బీజేపీ కూటమి విజయం.. మరో 30 చోట్ల ముందంజ
ఇకపోతే.. దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈశాన్య భారతంలో త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. 60 మంది సభ్యులున్న త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగగా, మేఘాలయ, నాగాలాండ్లు ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగింది. ఈ 3 రాష్ట్రాల ఫలితాలతోపాటూ.. దేశవ్యాప్తంగా మరో 4 రాష్ట్రాల్లోని 5 స్థానాలకు కూడా ఇవాళ ఫలితాలు రానున్నాయి. అవి అరుణాచల్ ప్రదేశ్లోని లుమ్లా, మహారాష్ట్రలోని కస్బాపేత్-చింద్వాడ్, తమిళనాడులోని ఈరోడ్, బెంగాల్లోని సగర్డిఘీ, జార్ఖండ్లోని రామ్గఢ్ స్థానాలు.