డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు విడుదల చేయాలని లేనిపక్షంలో బాంబులు వేస్తామంటూ ముంబై యూనివర్సిటీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ మెయిల్ వచ్చింది. బ్యాచిల్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ), బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్) సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలని అందులో హెచ్చరించారు.
ముంబైలోని ప్రఖ్యాత ముంబై యూనివర్సిటీని బాంబులు వేసి పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్స్ పంపడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు విడుదల చేయాలని లేనిపక్షంలో బాంబులు వేస్తామని ఈ మెయిల్స్లో తెలిపారు. బ్యాచిల్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ), బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్) సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలంటూ ముంబై వర్సిటీలోని పరీక్షల నిర్వహణ, మూల్యంకన విభాగం డైరెక్టర్ మెయిల్కు బాంబు బెదిరింపు వచ్చింది.
దీంతో అధికారులు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ముంబై యూనివర్సిటీ ఇటీవల ఫైనలియర్ విద్యార్థుల సెమిస్టర్ ఫలితాలు ఆలస్యంగా విడుదల చేసింది. అయితే మిగిలిన వారి ఫలితాలను కరోనా నేపథ్యంలో ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులే విశ్వవిద్యాలయానికి బెదిరింపులకు పాల్పడి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.