heavy rain: ముంబయిని ముంచెత్తిన భారీ వర్షాలు.. రైలు, బస్సు సర్వీసులకు అంతరాయం

Published : Jul 06, 2022, 01:08 PM IST
heavy rain: ముంబయిని ముంచెత్తిన భారీ వర్షాలు..  రైలు, బస్సు సర్వీసులకు అంతరాయం

సారాంశం

Mumbai Rain: ముంబయి, దాని శివారు ప్రాంతాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రైలు, బస్సు సర్వీసులు దెబ్బతిన్నాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధికారులను ఆదేశించారు.  

Heavy Rain In Mumbai:  మ‌హారాష్ట్రలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి కుండ‌పోత వ‌ర్షాల‌తో అత‌లాకుతలం అవుతోంది. ముంబ‌యి న‌గ‌రం, దాని శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండ‌ట‌తో బుధవారం నాడు సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. అనేక ప్రదేశాలలో నీటి ఎద్దడి ఏర్ప‌డి. ముంపు ప్రాంతాల్లో వ‌ర్ష‌పు నీరు క్ర‌మంగా పెరుగుతూనే ఉంది. దీంతో రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. శుక్రవారం వరకు ముంబ‌యి, దాని శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 

కుండ‌పోత వ‌ర్షం కార‌ణంగా ముంబ‌యిలోని లోతట్టు ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌లు నీట‌మునిగి ఉన్న ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.  వరదల కారణంగా నగరంలోని కొన్ని రూట్లలో రైలు, బస్సు సర్వీసులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో కొన్ని నదుల నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. వ‌ర‌ద‌నీటు కార‌ణంగా థానేలో గుంతలో ప‌డిన మోటార్‌సైకిల్‌పై నుంచి కిందపడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయ‌ప‌డి ప్రాణాల‌తో పోరాడుతున్నాడు. భారీ వర్షాల కారణంగా బుధ‌వారం తెల్లవారుజామున సతారా జిల్లాలోని ప్రతాప్‌గడ్ కోట సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.

 

రాయ్‌గఢ్, రత్నగిరి స‌హా మరికొన్ని జిల్లాలకు రానున్న కొద్ది రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ 'రెడ్, ఆరెంజ్' హెచ్చరికలను జారీ చేసింది.

 

 భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పరిపాలన అధికారులను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం ఆదేశించారు. ముఖ్యమంత్రి బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BCM) విపత్తు నియంత్రణ కార్యాల‌యం సందర్శించారు. ప్రాణనష్టాన్ని నివారించడానికి కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రదేశాల నుండి ప్రజలను తరలించాలని అధికారులకు చెప్పినట్లు చెప్పారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్)కి చెందిన అనేక బృందాలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ఉంచామని, అవసరమైతే మరింత మంది సిబ్బందిని త‌ర‌లిస్తామ‌ని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families