
ముంబయి: నేడు చిన్నప్పటి నుంచే పిల్లలు ఫోన్ చూడటం పెరిగిపోతున్నది. ఫోన్లలో గేమ్స్, వీడియోలు చూడటం కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ముంబయిలో ఓ 15 ఏళ్ల బాలికను ఫోన్ వాడకుండా అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మలడ్ సబర్బ్లోని ఓ ఏడంతస్తుల భవనంపై నుంచి దూకేసింది. మల్వాని ఏరియాలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. ఆ బాలిక డెడ్ బాడీని రికవరీ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ బాలిక పేరెంట్స్ను ట్రేస్ చేశారు.
అయితే, ఆ బాలిక ఆత్మహత్య వెనుక సిసలైన కారణం ఏమిటనేది ఇప్పటికైతే తెలియదని పోలీసులు చెప్పారు. ఆ బాలికను ఫోన్ వాడకుండా ఆమె కుటుంబం అడ్డుకున్నదని వివరించారు. ఇది ఆ బాలిక మనస్తాపానికి గురయ్యేలా చేసిందని, అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కేసులో దర్యాప్తు కూడా ప్రారంభించారు.