
ముంబయి: స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై నిప్పులు కురిపించారు. ఒక వేళ నీ భార్యను అరెస్టు చేస్తే ఎలా ఉంటుందని నేను ఆయనను అడుగుతా.. అదీ ఏ నేరం చేయకున్నా ఊచల వెనక్కి భార్య వెళ్లితే ఎలా ఉంటుందని అడుగుతాను అని పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీ ఎదుట హనుమాన్ చాలీసా చదువుతానని చాలెంజ్ చేసి అందుకు ప్రయత్నించడంతో ఈ అమరావతి ఎంపీ నవనీత్ రాణాతోపాటు ఆమె భర్త, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాలను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై రాజద్రోహం సహా పలు చట్టాల కింద కేసు నమోదైంది.
ఈ కేసులో వారిద్దరికీ బెయిల్ లభించింది. విడుదల అయ్యారు. బెయిల్పై బయట ఉన్న ఎంపీ నవనీత్ రాణా ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఒక్కసారి నీకు అధికారం పోయిన తర్వాత నీ ఇంటి నుంచి ముఖ్యంగా నీ భార్య రష్మిని ఎలాంటి నేరం చేయకున్నా ఊచల వెనక్కి నెడితే.. అప్పుడు అడుగుతా నీవు ఎలా ఫీల్ అవుతూ ఉంటావు’ అని ఆమె నిప్పులు కురిపించారు.
‘ఆయన తన ర్యా లీల్లో స్వయంగా హిందుత్వవాది అంటారు. హిందూ మత విశ్వాసకుడి ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదివితే మతపరమైన అశాంతిని రగిల్చినట్టు కాదు. వేరే మతం వాళ్ల ఇంటి ముందు ఇలా చేస్తే మాత్రం దాన్ని విద్వేషం అనవచ్చు. నేను ఎలాంటి విద్వేషాన్ని రగల్చలేదు’ అని ఆమె పేర్కొన్నారు.
‘నేనొక భారతీయ మహిళను. హనుమాన్ చాలీసా పఠించినందుకు జైలుకు వెళ్లుతానని ఎలా అనుకుంటాను. అర్ధరాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు.. మొత్తం రాత్రంతా జైలులోనే నిలబడే ఉండాల్సి వచ్చింది. వారు కనీసం కింద కూర్చోడానికి ఒక చాప, తాగడానికి నీరు కూడా ఇవ్వలేదు. వారికి కనీసం మానవత్తం కూడా లేకపోవడం బాధాకరం’ అని వివరించారు. ‘నా పిల్లలను ఎవరైనా మీ తల్లి ఎందుకు జైలుకు వెళ్లిందని అడిగితే.. ఎవరు సమాధానం చెబుతారు? హనుమాన్ చాలీసానే నాకు బలాన్ని ఇచ్చింది. హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పఠించాను. జైలులోని ఇతర మహిళలు కూడా హనుమాన్ చాలీసా చదివారు. నాకు ధైర్యాన్ని ఇచ్చారు’ అని అన్నారు.
భవిష్యత్లో ఆమె సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఎన్నికల్లో పోరాడనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. జీవితం పని చేయని వారు ఒకరి పేరుపై ఈ అధికారాన్ని అనుభవిస్తున్నారని ఉద్ధవ్పై పరోక్షంగా విమర్శలు సందించారు. అలాగే, ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టూ కూడా సంకేతాలు ఇచ్చారు.