ఈ నెల 31వ తేదీన కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఈ నెల 31వ తేదీన కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు దేశంలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. యాస్ తుఫాన్ బెంగాల్ తూర్పు తీరాన్ని ఇటీవల తాకింది. ఈ తుఫాన్ నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశించడానికి దోహదం చేసిందని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నైరుతి రుతుపవనాలు మాల్దీవులు-కొమెరిన్ ప్రాంతంతో పాటు బంగాళాఖాతాంలోకి వచ్చినట్టుగా వాతావరణశాఖాధికారులు ఈ నెల 27న ప్రకటించారు. జూన్ 1వ తేదీన సాధారణంగా కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు నాలుగు మాసాలు వర్షాలు కురుస్తాయి.జోన్ల వారీగా వర్ష ప్రభావం గురించి ఈ నెల 31న వాతావరణ శాఖ నివేదికను విడుదల చేయనుంది. కేవచ్చే నాలుగైదు రోజుల తర్వాత నైరుతి రుతుపవనాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణశాఖాధికారులు చెబుతున్నారు.
కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్ 1 నుండి 3 వ తేదీ వరకు కర్ణాటక, దక్షిణ, తీర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. దేశ ఆర్ధిక వ్యవస్థకు కేంద్రంగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తిపై అంచనాలను పెంచుతూ ఈ ఏడాది సరైన సమయంలో రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించనున్నాయన్నారు.దేశంలోని సగం భూముల్లో వరి, మొక్కజొన్న, చెరకు, పత్తి, సోయాబీన్స్ వంటి పంటలను పండించేందుకు రైతులు జూన్ నుండి సెప్టెంబర్ మాసాల్లో కురిసే వర్షాలే ఆధారం.