
BJP National Meet: రాజస్థాన్ లోని జైపూర్ లో బీజేపీ జాతీయ సదస్సు మూడు రోజులపాటు జరుగనున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో పార్టీకి చెందిన కీలక నేతలంతా హాజరవుతారు.
మూడు రోజుల బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం జైపూర్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో బీజేపీ జాతీయ, రాష్ట్ర పదాధికారులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. నాలుగు సెషన్లలో బీజేపీ ఆఫీస్ బేరర్లు హోటల్లో సమావేశం కానున్నారు. ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగిస్తారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం జైపూర్లోని బిర్లా ఆడిటోరియంలో నడ్డా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరుసటి రోజు నడ్డా అన్ని రాష్ట్రాల సంస్థాగత మంత్రులతో సమావేశం కానున్నారు. బీజేపీ జాతీయ స్థాయి సమావేశం జైపూర్లోని అమెర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న హోటల్ లీలా ప్యాలెస్ కుకాస్లో జరుగుతుంది. తొలి రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా అధ్యక్షతన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం అయ్యారు.
వర్చువల్ గా ప్రధాని మోదీ ప్రసంగం
రెండో రోజు.. మే 20న జైపూర్లో జరిగే భారతీయ జనతా పార్టీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసంగిస్తారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ తెలిపారు. అదే సమయంలో మే 20న నాలుగు సెషన్లు జరుగుతాయని, సాయంత్రం నడ్డా ప్రసంగంతో సభ ముగుస్తుందని చెప్పారు. మరుసటి రోజు మే 21న జాతీయ ప్రధాన కార్యదర్శుల (సంస్థ) సమావేశం జరగనుంది.
దేశ రాజకీయ పరిస్థితులపై చర్చ
మీడియాతో అరుణ్ సింగ్ మాట్లాడుతూ.. 'దేశ రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రతి బూత్లో పార్టీ పటిష్టతపై కూడా చర్చ జరగనుంది.ఈ సమావేశంలో జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులతో సహా 136 మంది ఆఫీస్ బేరర్లు సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీని పటిష్టం చేసే అంశాలపై చర్చిస్తారు. అలాగే మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి, ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబోయే ఉత్సవాల గురించి కూడా చర్చిస్తారు.
రాజస్థాన్ బీజేపీ కోర్ కమిటీ సమావేశం
అంతకు ముందు.. బుధవారం సాయంత్రం, బిజెపి ప్రధాన కార్యాలయంలో బిజెపి రాజస్థాన్ కోర్ కమిటీ సమావేశం జరిగింది, ఇందులో సమావేశ సన్నాహాలపై చర్చించారు. కోర్ కమిటీ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థ) చంద్రశేఖర్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గులాచ్ చంద్ కటారియా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కైలాష్ చౌదరి, సీనియర్ నాయకుడు ఓం ప్రకాష్ మాథుర్ , జాతీయ ప్రధాన కార్యదర్శి అల్కా గుర్జార్ , ప్రతిపక్ష ఉప నాయకుడు రాజేంద్ర రాథోడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఎంపీ సీపీ జోషి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.