
ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు రెండోసారి ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత హాజరవ్వనున్నారు. ఈ రోజు 11 గంటలకు కవిత ఈడీ విచారణకు హాజరవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారమే ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, కవిత ఈడీ విచారణకు హాజరయ్యే ముందు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈ ఉదయం పది గంటలకు ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రెస్ మీట్ లో ఆమె మీడియాను ఉద్దేశించి తనమీద వచ్చిన ఆరోపణల మీద క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే
ఫోన్ల ధ్వంసం విషయంపై కూడా కవిత క్లారిటీ ఇవ్వనున్నారు.
అంతకుముందు 11వ తేదీన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 9 గంటల పాటు ఈడీ కవితను విచారించింది. ఆ తరువాత మార్చి 16న మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపింది. ఈ రోజు అరుణ్ రామచంద్రపిళ్లై, బుచ్చిబాబులతో కలిసి ఎమ్మెల్సీ కవితను విచారించనున్నట్లు సమాచారం. గతరాత్రి 8గంటలవరకు బుచ్చిబాబును ప్రశ్నించారు. అరుణ్ రామచంద్ర పిళ్లై ఇప్పటికే అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
ఢీల్లీకి చేరుకున్న కవిత: రేపు ఈడీ విచారణపై ఉత్కంఠ
ఈడీ విచారణ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ మంత్రులు ఢిల్లీ చేరుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ లు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మరికొంతమంది మంత్రులు కూడా ఢిల్లీ చేరుకోనున్నారు. కేటీఆర్, హరీష్ రావులు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్న ఉదయం ఢిల్లీ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేజన్ బిల్లు మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈడీ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ లో కవిత ఏం మాట్లాడబోతున్నారు? ఈ రోజు ఏం జరగబోతోంది? ముందులాగే కవితను విచారించి పంపేస్తారా? అరెస్ట్ చేస్తారా? అనే అంశం మీద అటు బీఆర్ఎస్ వర్గాల్లో ఇటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.