
ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓషివారా ఫర్నీచర్ మార్కెట్ సమీపంలోని జోగేశ్వరి ప్రాంతంలో సోమవారం 11 గంటల సమయంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే 10 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయాత్నాలు మొదలు పెట్టాయి. అయితే ఈ మంటల వల్ల ఎవరికీ గాయాలు కాలేదని బీఎంసీ పేర్కొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం రిలీఫ్ రోడ్డులోని ఘాస్ కాంపౌండ్లోని ఓ ఫర్నీచర్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. మంటలు ఫర్నీచర్ మార్కెట్కే పరిమితమయ్యాయని, మంటలను ఆర్పే ప్రయత్నంలో మొత్తం మూడు చిన్న మోటార్ పంప్లను ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.
గ్రాండ్మాస్టర్ షిఫుజీ ఈ మంటలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ముంబై పోలీసుల అధికారిక హ్యాండిల్స్ను అలాగే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాలను ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘ జోగేశ్వరి వెస్ట్ హిందూ స్మషన్ భూమి, కబ్రిస్తాన్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అవసరమైన చర్యలు తీసుకోండి’’ అని ఆయన ట్వీట్ చేశారు.
మంటలు అంటుకున్న ప్రాంతం నుంచి దట్టమైన నల్లటి పొగ వెలువడుతున్నట్లు విజువల్స్ కనిపిస్తున్నాయి. ‘‘ఓషివారా ఫర్నీచర్ మార్కెట్లో మంటలు, జోగేశ్వరి వెస్ట్ ఎస్వీ రోడ్డు ఓషివారా కబ్రస్తాన్ వైపు రెండు వైపుల నుండి మూసివేయబడింది’’ మరో యూజర్ ట్వీట్ చేశారు.
మరొక యూజర్ ప్రతిస్పందిస్తూ, ముంబై పోలీసులు తమ అధికారిక హ్యాండిల్ నుండి ప్రధాన కంట్రోల్ రూమ్కు సమాచారం అందించినట్లు ట్వీట్ చేశారు.