
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. దీంతో పరిస్థితులు భయానకంగా మారాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హోం శాఖ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. హింసాత్మక చర్యలను కట్టడి చేయడంలో భాగంగా తీవ్రమైన కేసుల్లో కనిపిస్తే కాల్చివేతకు గవర్నర్ ఆదేశించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్(హోం) సంతకం చేసిన నోటిఫికేషన్ జారీ చేయబడింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 నిబంధనల ప్రకారం ఇది జారీ చేయబడింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. పరిస్థితులను నియంత్రించలేని పరిస్థితుల్లో.. అన్నిరకాల హెచ్చరికలు అయిపోతే కాల్పులకు అవకాశం కల్పించారు.
రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మెయిటీలను షెడ్యూల్డు తెగల కేటగిరీలోకి తేవాలనే డిమాండ్ను గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసనలకు ది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ నాయకత్వం వహిస్తోంది. బుధవారం గిరిజన సంఘీభావ యాత్రలో హింసాత్మక సంఘటనలు నమోదవడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. అయితే తమకు సంఘీభావం తెలుపుతున్న నిరసనకారులే ఈ హింసాకాండకు పాల్పడుతున్నారనే ఆరోపణలను గిరిజనుల నిరసనలకు నాయకత్వం వహిస్తున్న సంఘం ఖండించింది.
కర్ఫ్యూ, ఇంటర్నెట్ నిలిపివేత
గిరిజనుల ఆందోళన సందర్భంగా హింస చెలరేగడంతో మణిపూర్ ప్రభుత్వం బుధవారం ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. గిరిజనేతరులు అధికంగా ఉండే ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, తౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతో పాటు గిరిజనులు అధికంగా ఉండే చురచంద్పూర్, కాంగ్పోక్పి, తెంగ్నౌపాల్ జిల్లాల్లో దీనిని అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
దేశ వ్యతిరేక, సంఘ విద్రోహ శక్తుల కుట్ర, కార్యకలాపాలను అడ్డుకోవడానికి, శాంతి, మత సామరస్యాన్ని కాపాడటానికి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు, ప్రాణాలకు నష్టం జరకుండా చూసేందుకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొంటూ హోమ్ శాఖ కమిషనర్ హెచ్ జ్ఞాన్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి వివిధ సామాజిక వేదికల ద్వారా తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తిని నిరోధించడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి ఈ చర్య తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు.
మణిపూర్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న కేంద్రం.. మరోసారి అల్లర్లు చెలరేగితే అదుపులో పెట్టేందుకు ప్రత్యేక దళమైన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలను కూడా ఈశాన్య రాష్ట్రంలోని హింసాత్మక ప్రాంతాలలో మోహరించడం కోసం పంపింది. ఈ సాయంత్రం ఇంఫాల్ విమానాశ్రయంలో బలగాలు దిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే.. మణిపూర్ లో చెలరేగుతున్న హింసపై భారత బాక్సింగ్ సూపర్ స్టార్ మేరీకోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ల సహాయం కోరారు. ‘‘నా రాష్ట్రం మణిపూర్ మండుతోంది, దయచేసి సహాయం చేయండి’’ అంటూ ప్రధాని మోడీ, అమిత్ షాలను ట్యాగ్ చేస్తూ ఆమె ట్వీట్ చేశారు.