
Manipur Violence: హింసాత్మక ఘటనలతో అతలాకుతలమైన మణిపూర్ లో పర్యటించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఈశాన్య రాష్ట్రంలో తన రెండు రోజుల పర్యటనకు సంబంధించిన దృశ్యాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో శాంతి నెలకొనాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో మణిపూర్ సోదరసోదరీమణులు బాధలో ఉండటం చూసి గుండె పగిలిందనీ, శాంతి ఒక్కటే ముందున్న మార్గమనీ, ఆ దిశగా మనమంతా కృషి చేయాలన్నారు.
మణిపూర్ హింసతో అట్టుడుకుతోంది. ఈ క్రమంలోనే మరో ఘటనలో ఆర్మీ జవాన్ ఇంటికి నిప్పుపెట్టారు. రాష్ట్రంలోని తౌబాల్ జిల్లాలో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్బీ) జవాను ఇంటిని అల్లరిమూకలు తగలబెట్టారని సంబంధిత అధికారులు తెలిపారు. నాలుగు కిలోమీటర్ల దూరంలోని వాంగ్బాల్లోని 3వ IRB క్యాంపుపైకి 700-800 మంది గుంపు దాడికి ప్రయత్నించినప్పుడు జరిగిన ఘర్షణలో రొనాల్డోగా గుర్తించబడిన 27 ఏళ్ల వ్యక్తి మరణించిన తర్వాత ఈ సంఘటన జరిగింది. పోలీసు ఆయుధశాల నుండి తుపాకీలను దోచుకోవడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ఆయుధాగారానికి కాపలా కాస్తున్న ఐఆర్ బీ యూనిట్ లో ఆ జవాన్ కూడా ఉన్నారని తెలిపారు.
రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాల సంయుక్త బృందం బుధవారం కాంగ్పోక్పి, ఇంఫాల్ వెస్ట్, చురచంద్పూర్ జిల్లాల్లో నాలుగు బంకర్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలోనే గుర్తుతెలియని ముష్కరుల బృందాలు పగటిపూట కాల్పులు జరిగాయి. భద్రతా దళాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు, మంగళవారం ఐఆర్బీ శిబిరంపై దాడి జరిగినప్పుడు బలగాలు మొదట బాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించాయి. అయితే సాయుధ గుంపు కాల్పులు జరపడంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు. అలాగే, శిబిరానికి వెళ్తున్న అస్సాం రైఫిల్స్ బృందంపై అల్లరిమూకలు దాడి చేశాయి. వారు సిబ్బందిపై కాల్పులు జరిపారని, ఇందులో ఒక జవాను గాయపడ్డారని, వారి వాహనాన్ని తగలబెట్టారని అధికారులు తెలిపారు.