
Firing In Manipur Again: ఈశాన్య భారత్ రాష్ట్రమైన మణిపూర్ లో మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఖోయిరెంతక్ పరిసర గ్రామాల్లో జరిగిన కాల్పుల్లో గ్రామ వాలంటీర్ మృతి చెందినట్లు ఆదివాసీ ట్రైబల్ లీడర్స్ ఫోరం పేర్కొంది.
తీవ్ర అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ లో కొన్ని రోజులుగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అయితే, ఇలాంటి తరుణంలో మరోసారి రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. కుకీ ప్రాబల్యం ఉన్న చురాచంద్ పూర్, మెయిటీ ప్రాబల్యం ఉన్న బిష్ణుపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మళ్లీ భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. నరన్సేనను ఆనుకుని ఉన్న గ్రామాల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు మణిపూర్ పోలీసులు తెలిపారు. ఏడుగురికి బుల్లెట్ లేదా చీలిక గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో మోహరించిన జిల్లా పోలీసులు, అస్సాం రైఫిల్స్, ఆర్మీ, కేంద్ర బలగాలు స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
ఖోయిరెంతక్ పరిసర గ్రామాల్లో జరిగిన కాల్పుల్లో గ్రామ వాలంటీర్ మృతి చెందినట్లు ఆదివాసీ ట్రైబల్ లీడర్స్ ఫోరం పేర్కొంది. అతడిని జంగ్మిన్లున్ గాంగ్టే (30)గా గుర్తించారు. ఖోయిరెంటాక్, తినుంగ్గే ప్రాంతాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మరో ఘటనలో ఓ రైతుపై కొండ దిగువన ఉన్న అనుమానిత మిలిటెంట్లు కాల్పులు జరిపారు. నరన్సేనా వార్డు నెంబర్ 8 నివాసి ఇబోటన్ కుమారుడు సలాం జోతిన్ (40) ఈ ఉదయం తినుంగీ మానింగ్ లీకైలోని తన వరి పొలానికి వెళ్తుండగా కాల్పులు జరిగాయి.
అతని ఛాతిపై బుల్లెట్ గాయాలు కావడంతో ఇంఫాల్ లోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో మే నెలలో హింస చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకు 140 మందికి పైగా మరణించారు. మణిపూర్ లోని మైతీ కమ్యూనిటీ, కూకీ కమ్యూనిటీ మధ్య కొనసాగుతున్న ఘర్షణ మధ్య ఈ మరణాలు సంభవించాయి.