Manipur Violence: మణిపూర్ లో హింసాకాండ కొనసాగుతోంది. అమిత్ షా పర్యటనకు కొన్ని గంటల ముందే మణిపూర్ అల్లర్లలో ఐదుగురు మృతి చెందారు. 40 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు తమకు సమాచారం అందిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు.
Manipur violence: మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి రాష్ట్రంలో అల్లర్లు చెలరేగడంతో శాంతిభద్రతలకు కాపాడేందుకు అధికార వర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, అమిత్ షా పర్యటనకు కొన్ని గంటల ముందే మణిపూర్ అల్లర్లలో ఐదుగురు మృతి చెందారు. 40 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు తమకు సమాచారం అందిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. మణిపూర్ లో చెలరేగిన హింసాకాండలో ఓ పోలీసు సహా ఐదుగురు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. అధునాతన ఆయుధాలతో ఉగ్రవాదులు సెరో, సుగుణు ప్రాంతాల్లోని పలు ఇళ్లకు నిప్పుపెట్టడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ హింస చెలరేగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గత రెండు రోజుల్లో 40 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు.
"ఉగ్రవాదులు ఎం-16, ఏకే-47 అసాల్ట్ రైఫిల్స్, స్నైపర్ గన్లను పౌరులపై ప్రయోగిస్తున్నారు. పలు గ్రామాలకు వచ్చి ఇళ్లను తగులబెట్టారు. సైన్యం, ఇతర భద్రతా దళాల సహాయంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించాం. దాదాపు 40 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు తమకు సమాచారం అందిందని" బీరెన్ సింగ్ మీడియాకు తెలిపారు. గత రెండు రోజులుగా ఇంఫాల్ లోయ శివార్లలో పౌరులపై హింసాత్మక దాడులు పెరగడం పక్కా ప్రణాళికాబద్ధంగా కనిపిస్తోందనీ, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని, సాధారణ పరిస్థితులు నెలకొనేలా కృషి చేయాలని అమిత్ షా మైతీలు, కుకీలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించడానికి అమిత్ షా అంతకుముందు మైతీలు, కుకి కమ్యూనిటీల ప్రతినిధులు, ఇతర భాగస్వాములతో వరుస సమావేశాలు నిర్వహించారు. శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే శనివారం మణిపూర్ వెళ్లారు. తమకు రిజర్వేషన్ ప్రయోజనాలు, అటవీ భూములను అందుబాటులో ఉంచే షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీలో చేర్చాలని మైతీ కమ్యూనిటీ చేసిన డిమాండ్ కు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు, ప్రధానంగా కుకీలు గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో హింస చెలరేగింది.
ఈ హింసాకాండకు ముందు కుకి గ్రామస్తులను రిజర్వ్ ఫారెస్ట్ భూమి నుండి ఖాళీ చేయించడంపై ఉద్రిక్తత ఏర్పడింది, ఇది వరుస చిన్న ఆందోళనలకు దారితీసింది. హింస మరింత పెరగకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కర్ఫ్యూలు, ఇంటర్నెట్ నిషేధం విధించింది. తాజా హింస కారణంగా ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో 11 గంటల కర్ఫ్యూ సడలింపు వ్యవధిని కేవలం ఆరున్నర గంటలకు కుదించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందని కేంద్రంపై కాంగ్రెస్ మండిపడింది. మణిపూర్ అంశంపై మల్లిఖార్జున ఖర్గే మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారని కాంగ్రెస్ తెలిపింది.