
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో మళ్లీ కమలం వికసించనుంది. 60 స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీలో అత్యధిక స్థానాలు సాధించి బీజేపీ కషాయ జెండాను ఎగరవేయనుంది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఇదే తేల్చాయి. అయితే గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన కాంగ్రెస్ ఈ సారి రెండో స్థానంలో నిలవనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మిగితా పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిసి కనీసం రెండు అంకెల స్థానాలు కూడా సాధించలేరని తెలిపాయి.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ మణిపూర్ లో రెండో సారి అధికారంలోకి రానుందని తెలిపింది. అయితే కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తుందని చెప్పింది. బీరేన్ సింగ్ ఆధ్వర్యంలోని బీజేపీ అధికారం చేపట్టనుందని అంచనా వేసింది. ఈ సారి బీజేపీ 25 నుంచి 31 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో నిలవనుందని తెలిపింది. ఇక్కడ ఆ పార్టీ 17 నుంచి 21 సీట్లను గెలుచుకుంటుందని తెలిపింది
అలాగే జీ న్యూస్-డిజైన్బాక్స్డ్ (Zee News-Designboxed) చేపట్టిన సర్వేలో బీజేపీ (bjp)కి 32-38 సీట్లు, కాంగ్రెస్ (congress)కు 12-17 సీట్లు వస్తాయని తేలింది. ఇండియా టీవీ-గ్రౌండ్ జీరో రీసెర్చ్ (India TV-Ground Zero Research) ప్రకారం బీజేపీకి 26-31 సీట్లు, కాంగ్రెస్కు 12-17 సీట్లు వస్తాయని తెలిపాయి. ఈ సారి కూడా బీజేపీ అధికారం చేపట్టనుందని చెప్పాయి. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలోకి వెల్లిపోనుందని పేర్కొన్నాయి.
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 33-43 సీట్లు, కాంగ్రెస్ 4-8 సీట్లు మాత్రమే గెలుచుకుంటాయని తెలిపింది. బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని చెప్పింది. NPP 4-8 సీట్లు గెలుచుకోవచ్చని, ఇతరులు 6-15 సీట్లు పొందవచ్చని అంచనా వేసింది.
ఇండియా న్యూస్-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 23-28 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ దాని కూటమికి 10-14 వచ్చే అవకాశం ఉంది. బీజేపీయే అధికారం చేపడుతుందని తెలిపింది.
2017 మణిపూర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ సమయంలో బీజేపీ 21 సీట్లు గెలుచుకుంది. నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP), నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF), చెరో నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. లోక్ జనశక్తి పార్టీ (LJP) ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. మొత్తం ఓట్లలో బీజేపీకి 36.28 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్కు 35.11 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అది ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. బీరెన్ సింగ్ నాయకత్వంలో ఎన్పీపీ, ఎన్పీఎఫ్, ఎల్ జేపీలతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అయితే ఈ ఎన్నికల్లో ఈసారి బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. మొత్తం 60 స్థానాల్లో ఒంటరిగానే పోటీగానే ఎలాంటి పొత్తులు లేకుండా రంగంలోకి దిగింది. కాగా మరోవైపు కాంగ్రెస్ (Congress) ఆరు రాజకీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసింది. దానికి మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్ (MPSA) అని పేరు పెట్టింది. MPSAలో సంకీర్ణ భాగస్వాములలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), జనతాదళ్ (సెక్యులర్) ఉన్నాయి. వీటితో పాటు ఎన్ సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తమ అభ్యర్థులను బరిలో నిలిపింది.