ఆన్ లైన్ క్లాసులు వదిలి.. ఇన స్టాగ్రామ్.. యువకుడి పరిచయంతో..

By telugu news teamFirst Published Jun 27, 2020, 12:02 PM IST
Highlights

లాక్‌డౌన్‌ అమలయినప్పటి నుంచి ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సమయం గడుపుతూ వ్యక్తిగత ఫోటోలు కూడా అప్‌లోడ్‌ చేస్తూ ఉండేది. ఇలా ఉండగా హైదరాబాద్‌కు చెందిన విశాల్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. 

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. కాగా.. ఈ వైరస్ ప్రభావంతో పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనపడటం లేదు. దీంతో.. చాలా స్కూల్స్ ఆన్ లైన్లోనే పాఠాలు చెబుతున్నారు. అయితే.. ఈ సమయంలో పిల్లలు సోషల్ మీడియాకి ఎక్కువగా కనెక్ట్  అవుతున్నారు. తాజాగా ఓ మైనర్ బాలిక సోషల్ మీడియాలో ఓ వ్యక్తి  మాయలో పడిపోయింది. అయితే.. అతని తండ్రి చొరవతో బయటపడగలిగింది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగళూరు ఉత్తరహళ్లిలోని ఏజీఎస్‌ లేఔట్‌లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మైనర్‌ బాలిక ఆన్‌లైన్‌ పాఠాలతో ఇంటర్నెట్, సోషల్‌ మీడియాకు బాగా అలవాటు పడింది.ఈ క్రమంలో లాక్‌డౌన్‌ అమలయినప్పటి నుంచి ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సమయం గడుపుతూ వ్యక్తిగత ఫోటోలు కూడా అప్‌లోడ్‌ చేస్తూ ఉండేది. ఇలా ఉండగా హైదరాబాద్‌కు చెందిన విశాల్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. 

విశాల్‌ బాలికతో నిన్ను వదిలి ఉండలేనని, హైదరాబాద్‌ వచ్చేయాలని చెప్పాడు. దీంతో బాలిక జూన్‌ 8వ తేదీన మ్యూజిక్‌ క్లాస్‌ వెళ్లాలని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చి నేరుగా కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. కుమార్తెలో మార్పును మొదటి నుంచి గమనిస్తున్న తండ్రి ఎంతసేపటికీ కూతురు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆమె ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌‌ డీకోడ్‌ చేసి చాటింగ్‌ హిస్టరీ చూసి విషయం తెలుసుకున్నాడు.

చాటింగ్‌లో విశాల్‌ హైదరాబాద్‌ రావడానికి బాలికకు విమానం టిక్కెట్‌ కూడా బుక్‌ చేసిన సంగతి తెలిసింది. నేరుగా ఎయిర్‌‌పోర్టుకు వెళ్లగా కుమార్తె పట్టుబడింది. ఇదే నెల 17న తండ్రి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

హైదరాబాద్‌కు చెందిన విశాల్‌ బాలికకు 18 సంవత్సరాలు నిండాయని నమ్మించడానికి నకిలీ ఎస్‌ఎస్‌ఎల్‌సీ మార్క్స్‌ కార్డ్‌ తయారు చేయించాడు. వస్తూ ఫోటోలు, ఆధార్‌కార్డు, కొంత నగదు తీసుకురావాలని చెప్పడంతో బాలిక ఆదేవిధంగా చేసింది. అయితే విశాల్‌కు సంబంధించి ఎటువంటి వివరాలు పోలీసులకు ఇంకా లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

click me!