గొంతు కోసి, లాక్కొచ్చి, కడుపుపై కారు ఎక్కించి భార్యను చంపిన డాక్టర్

By telugu teamFirst Published Feb 21, 2021, 9:11 AM IST
Highlights

ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా చంపేశాడు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భార్యను చంపిన తర్వాత పారిపోయే క్రమంలో అతను ప్రమాదానికి గురయ్యాడు.

చెన్నై: తమిళనాడులో ఓ వ్యక్తి కిరాతక చర్యకు పాల్పడ్డాడు. భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడవడమే కాకుండా కడుపు మీదికి కారును ఎక్కించి హతమార్చాడు. అతను వృత్తిరీత్యా ఓ డాక్టర్. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

కోయంబత్తూరుకు చెందిన గోకుల్ కుమార్ (40) కాటాన్ కొళకత్తూరులోని ఆ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. మరో ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న దగ్గరి బంధువు కీర్తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి వివాహం మూడేళ్ల క్రితం జరిగింది. వారికి పిల్లలు లేరు. 

చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలోని కృష్ణప్రియ నగర్ లో నివాసం ఉంటున్న కీర్తన తల్లి కుమారి, తండ్రి మురహరి ఇంట్లోనే ఇల్లరికం అల్లుడిగా గోకుల్ కుమార్ ఉండేవాడు. అయితే, ఈ మధ్య కీర్తన, గోకుల్ కుమార్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దాంతో ఇద్దరు కలిసి విడాకుల కోసం కోర్టుకు ఎక్కారు. 

శుక్రవారంనాడు గోకుల్ కుమార్ కీర్తన ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని అడ్డు వచ్చిన మామ మురహరిపై దాడి చేశాడు. కీర్తనను విచక్షణారహితంగా పొడిచి గొంతు కోసి బయటకు లాక్కొచ్చి కారును ఆమెపైకి ఎక్కించి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న మధురాంతకం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మురహరిని ఆస్పత్రికి తరలించారు. కీర్తన శవాన్ని మార్చురీకి తరలించారు. అయితే, తప్పించుకుని పారిపోయే క్రమంలో గోకుల్ కుమార్ అతని కారు ప్రమాదానికి గురైంది. టోల్ గేట్ వద్ద కారు బోల్తా పడింది. దాంతో గాయపడిన గోకుల్ కుమార్ చెంగల్పట్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

click me!