
ఉత్తర ప్రదేశ్ : రంగస్థలం సినిమాలో కనిపించినలాంటి ఘటనే నిజజీవితంలో ఎదురయ్యింది. యాక్సిడెంట్లో కోమాలోకి వెళ్లిన విలన్ కు హీరో సేవలు చేసి.. అతను పూర్తిగా కోలుకున్న తర్వాత.. చేసిన తప్పేంటో చెప్పి మరీ హత్య చేస్తాడు. అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లోని ఖేరి జిల్లా మితౌలి గ్రామంలో చోటుచేసుకుంది. ప్రతీకారంతో రగిలిపోతున్న ఓ వ్యక్తి తన కొడుకుని చంపి జైల్లో ఉన్న నిందితుడికి బెయిల్ ఇచ్చి మరీ బయటికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత కసితీరా హత్య చేశాడు.
దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…కాశీ కాశ్యప్ (50) అనే వ్యక్తికి జితేంద్ర అనే 14 ఏళ్ల కొడుకు ఉండేవాడు. 2020లో కాశీ ఓ హత్య కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత అతని భార్య.. వారి సమీప బంధువైన శత్రుధన్ లాలా (47)తో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో వీరికి కొడుకు జితేంద్ర అడ్డుగా అనిపించాడు. దీంతో ఇద్దరు కలిసి జితేంద్రను చంపేశారు. ఇది వెలుగులోకి రావడంతో వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఈ క్రమంలో నిరుడు కాశీ జైలు నుంచి విడుదలయ్యాడు. కొడుకును అకారణంగా పొట్టన పెట్టుకున్న శత్రుధన్ లాలా మీద ప్రతీకారంతో కక్ష కట్టాడు. ఎలాగైనా అతనిని హతమార్చాలనుకున్నాడు. జైలులో ఉన్న అతనిని చంపడం ఎలాగా అని ఒక ప్లాన్ వేశాడు. తన సొంత ఖర్చులతో లాయర్ ను ఏర్పాటు చేశాడు. లాలాకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చాడు. బయటికి వచ్చిన లాలాను శుక్రవారం రాత్రి తుపాకితో కాల్చి చంపాడు. విషయం తెలిసిన పోలీసులు కాశీని అదుపులోకి తీసుకున్నారు.