నాలుగోసారీ కూతురే పుట్టిందని వ్యక్తి ఆత్మహత్య.. కర్నాటకలో విషాదం...

By SumaBala BukkaFirst Published Nov 7, 2022, 1:04 PM IST
Highlights

నాలుగోసారి కూడా ఆడపిల్లే పుట్టడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నాటకలో కలకలం రేపింది. మగబిడ్డ పుట్టలేదని మనస్తాపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.

కర్నాటక : కర్నాటకలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య నాలుగో కాన్పులో కూడా ఆడపిల్లకే జన్మనివ్వడంతో తట్టుకోలేని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరుకు 90 కిలోమీటర్ల దూరంలోని కోలార్ జిల్లా శ్రీనివాసపూర్ తాలూకాలోని సెట్టిహళ్లిలో జరిగింది. 34 ఏళ్ల ఆ వ్యక్తి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు రోజే అతని భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మగబిడ్డ లేకపోవడంతో.. ఈ సారి అబ్బాయి పుడతాడని ఆశపడి.. అలాజరగకపోవడంతోనే దారుణమైన నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆదివారం తెల్లవారుజామున లోకేశ్‌ సీలింగ్‌కు ఉరివేసుకుని ఉండడాన్ని అతని తల్లి గమనించచడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లోకేష్‌కి తొమ్మిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. సామాజిక కార్యకర్త, సెట్టిహళ్లి గ్రామస్థుడు నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం అతనికి మూడో కుమార్తె జన్మించింది. అప్పుడే మగబిడ్డ లేకపోవడంతో లోకేశ్‌ అసహనం వ్యక్తం చేశాడని, తాను చచ్చిపోతానని కొందరి స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది. అయితే, అతని స్నేహితులు అలా చేయడం సరికాదంటూ నచ్చజెప్పారు. 

యువకుడిపై ఐదురుగు వ్యక్తుల దాడి.. చెవి పగలగొట్టి, హింసించి, అసభ్యకరవీడియో చిత్రీకరించి.. ట్విస్ట్ ఏంటంటే..

ఆ తరువాత లోకేష్ భార్య మళ్లీ గర్భం దాల్చడంతో ఈసారి ఖచ్చితంగా మగబిడ్డ పుడుతుందని ఆశపడ్డాడు. అయితే శుక్రవారం ముల్‌బాగల్‌లోని ఓ ఆసుపత్రిలో ఆమె ప్రసవించింది. అయితే నాలుగోసారి కూడా ఆడబిడ్డే పుట్టింది. దీంతో లోకేష్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని నాగభూషణం తెలిపారు. లోకేష్ కు గ్రామంలో ఎవరితోనూ గొడవలు, ఆర్థిక సమస్యలేవీ లేవని, మగబిడ్డ లేని కారణంగానే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడని అనుమానిస్తున్నట్లు నాగభూషణ తెలిపారు.

భార్య ప్రసవించి ఆస్పత్రిలో ఉండడంతో లోకేష్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. దీంతో పక్కనే మరో కుమారుడితో కలిసి ఉంటున్న అతడి తల్లి శనివారం రాత్రి లోకేష్ కు భోజనం వడ్డించింది. ఆ తరువాత ఆమె తనఇంటికి వెళ్లిపోయింది. తెల్లారినా కొడుకు తలుపులు తెరవకపోవడంతో.. లోపలికి వెళ్లి చూసిన తల్లికి దూలానికి వేలాడుతున్న కొడుకు శవం కనిపించింది. అది చూసి షాక్ అయిన ఆమె.. పెద్దగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి చూసి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

click me!