కోర్టు రూంలోనే హత్య కేసు నిందితుడ్ని కాల్చి చంపారు

By telugu teamFirst Published Dec 17, 2019, 3:28 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ లో ఓ హత్య కేసు నిందితుడిని కోర్టు రూంలోనే కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. హత్య కేసులో నిందితుడైన ఓ వ్యక్తిని కోర్టు రూంలోనే కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ పట్టణంలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు రూంలో మంగళవారం సాయంత్రం కాల్పులు జరిగాయి.ఆ సంఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

జంట హత్య కేసులో నిందితుడైన షానవాజ్ అన్సారీని జైలు నుంచి తీసుకుని వచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. ముగ్గురు వ్యక్తులు పిస్టల్స్ తో కోర్టు రూంలోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన తర్వాత పారిపోతున్న ముగ్గురిని వెంటాడి పోలీసులు పట్టుకున్నారు.

బహుజన్ సమాజా పార్టీకి చెందిన హజీ అహసన్ ఖాన్, అతని బందువులను హత్య చేసిన కేసులో అన్సారీ నిందితుడు. మేలో ఈ హత్య జరిగింది. ఈ జంట హత్య కేసులో అన్సారీ ఢిల్లీ కోర్టులో లొంగిపోయాడు. ఢిల్లీ పోలీసులు అతన్ని బిజ్నోర్ తీసుకుని వచ్చిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. 

హజీ అహసన్ ఖాన్ కుమారుడితో పాటు మరో ఇద్దరు అతనిపై కోర్టు రూంలో కాల్పులు జరిపారు. కోర్టు ఉద్యోగి ఒక్కరు ఈ ఘటనలో గాయపడ్డారు. 

click me!