అప్రమత్తమైన లోకో పైలెట్.. తప్పిన భారీ రైలు ప్రమాదం..  

By Rajesh KarampooriFirst Published Jun 7, 2023, 4:11 AM IST
Highlights

జార్జండ్ లోని భోజుడిహ్ రైల్వే స్టేషన్ సమీపంలో సంతల్దిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ట్రాక్, గేట్ మధ్య ట్రాక్టర్ ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని గమనించిన రైలు డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో తృటిలో భారీ రైలు ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 22812) వెళుతుండగా, సంతల్దిహ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో రైల్వే గేట్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో రైలు ట్రాక్, గేట్ మధ్య ట్రాక్టర్ ఇరుక్కుపోయింది. ఇది గమనించిన లోకో పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

బొకారో జిల్లాలోని భోజుడిహ్ రైల్వే స్టేషన్ సమీపంలోని సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే లైన్, గేట్ మధ్య ట్రాక్టర్ ఇరుక్కుపోయిందని సౌత్ ఈస్టర్న్ రైల్వే (ఆద్రా డివిజన్) DRM మనీష్ కుమార్ మీడియాకు తెలిపారు. అయితే రైలు డ్రైవర్ అప్రమత్తమై..బ్రేకులు వేయడంతో రైలు ఆగిపోయిందనీ, దీంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. అదే సమయంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.

45 నిమిషాల పాటు నిలిచిపోయిన రైలు

ఈ ఘటన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగిందని, దీంతో రైలు దాదాపు 45 నిమిషాల పాటు నిలిచిపోయిందని మనీష్ కుమార్ తెలిపారు. ట్రాక్టర్‌ను సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. గేట్ మ్యాన్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత ఈ విషయం తెరపైకి వచ్చింది. బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొనడంతో 288 మంది మృతి చెందగా, 1,100 మందికి పైగా గాయపడ్డారు.
 
అస్సాంలో మరో ఘటన 

అస్సాంలో రైలు ఇంజన్ నుండి రైలు కోచ్‌లు వేరు చేయబడ్డాయి. అంతకుముందు.. అస్సాంలోని కోక్రాఝర్ జిల్లాలో శనివారం పెను రైలు ప్రమాదం తప్పింది. ఇంజిన్, మరో రెండు కోచ్‌లతో పాటు రైలు ముందుకు పరుగెత్తింది. మిగిలిన ఎనిమిది కోచ్‌లు రైలు నుండి వేరు చేయబడ్డాయి. రైలు ఇంజన్ రెండు కోచ్‌లతో పాటు దాదాపు 600 మీటర్లు ముందుకు కదిలింది. అదృష్టవశాత్తూ వెనుక నుంచి రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

click me!