టెండూల్కర్ సహా ప్రముఖుల ట్వీట్లపై దర్యాప్తు .. మహారాష్ట్ర సంచలనం

By AN TeluguFirst Published Feb 8, 2021, 4:03 PM IST
Highlights

రైతు దీక్షల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా సినీ, క్రికెట్ ప్రముఖులు చేసిన ట్వీట్లపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపుతామని ప్రకటించింది. ఈ మేరకు మహరాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. 

రైతు దీక్షల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా సినీ, క్రికెట్ ప్రముఖులు చేసిన ట్వీట్లపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపుతామని ప్రకటించింది. ఈ మేరకు మహరాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. 

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, గాయని లతా మంగేష్కర్ తో పాటు బాలీవుడ్ నటులు అక్షయ్‌ కుమార్, అజయ్‌ దేవగన్‌, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఒకే విధమైన ట్వీట్స్‌ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని, దీనిపై మహారాష్ట్ర ఇంటిలిజెన్స్ సంస్థలు దర్యాప్తు జరుపుతాయని సోమవారం అనిల్‌ ప్రకటించారు. 

వరుస ట్వీట్ల వెనుక కేంద్ర ప్రభుత్వమా లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు జరపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. హోంమంత్రి ప్రకటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పలువురు అంతర్జాతీయ ప్రముఖులు ట్వీట్స్ చేశారు. 

వీరిలో పాప్ సింగర్ రిహనే, పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్ బర్గ్, మియా ఖలిఫా వంటివాళ్లున్నారు. భారత్ లో రైతులు జరుపుతున్న ఉద్యమానికి తాము సంగీభావం తెలుపుతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారి మద్దతును ఖండిస్తూ సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, అక్షయ్‌కుమార్‌ వంటి వారు ట్వీట్‌ చేశారు.

భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఇతరులకు లేదని, తమ దేశ సమస్యలను తాము పరిష్కరించుకోగలమని ముక్తకంఠంతో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఈ పరిణామం దేశంలో  పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కేంద్రానికి మద్దతు ప్రకటించడాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఓ వర్గం వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. 

కాంగ్రెస్ లోని కొందరు నేతలతో సహా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, రాజ్ ఠాక్రే సైతం ఈ ట్వీట్స్ ను ఖండించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఒత్తిడితోనే సచిన్‌, లతా మంగేష్కర్‌ వంటి వారు ఈ ట్వీట్స్‌ చేశారని పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది.

click me!