
భోపాల్ : మందబలం, అధికార బలం కోసం కొందరు తహతహలాడుతుంటారు. ఓ పదిమందిని వెంటేసుకుని ఓ గ్యాంగ్ కు లీడర్ అయిపోతారు. డబ్బుల కోసం జనాలను పీడిస్తుంటారు. రకరకాల నేరాలకు పాల్పడుతుంటారు. అడ్డు, అదుప లేకుండా ప్రవర్తిస్తారు.
అయితే ఇలాంటి వారికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం. ఇక మీదట గ్యాంగ్ స్టర్ గా మారాలంటే వారి వెన్నుల్లో వణుకు పుట్టించే ఓ చట్టాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానుంది.
మధ్యప్రదేశ్ లో వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా ‘మధ్యప్రదేశ్ గ్యాంగ్ స్టర్ నిరోధక బిల్లు’ను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుందని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. ఈ చట్టం ప్రకారం.. గ్యాంగ్ స్టర్ లకు పది సంవత్సరాల జైలుశిక్ష విధించడంతో పాటు ఆస్తులను అటాచ్ చేయడం జరుగుతుందని అన్నారు.
లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, పేకాట డెన్ లు నిర్వహిస్తున్న వారిని కట్టడి చేయడానికి ఈ చట్టం తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.