
మధ్యప్రదేశ్లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నర్మద నదిలో పడిపోయింది. ఖార్గోన్, ధార్ జిల్లా సరిహద్దులోని ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందినట్టుగా సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో బస్సును బయటకు తీసినట్టుగా అధికారులు వెల్లడించారు. ఇక, ప్రమాదానికి గురైన బస్సు ఇండోర్ నుంచి మహారాష్ట్రలోని పుణేకు వెళ్తున్నట్టుగా సమాచారం. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా.. 15 మందిని రక్షించినట్టుగా అధికార వర్గాలు తెలిపాయి. అయితే ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ వెంటనే స్పందించారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల నిమిత్తం ఎస్డీఆర్ఎఫ్ను ఘటన స్థలానికి పంపాలని ఆదేశించారు. దీంతో పాటు క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఖర్గోన్, ధార్, ఇండోర్ జిల్లాల యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక మత్స్యకారులు కూడా సహాయకచర్యల్లో అధికార యంత్రాగానికి సహాకారం అందిస్తున్నారు. క్రేన్ సాయంతో బస్సును నదిలో నుంచి బయటకు తీశారు.