మధ్యప్రదేశ్లో ఓ దళిత బాలికపై అత్యాచారం జరిగింది. నిందితుడిపై అత్యాచారం కేసు పెట్టాలని ఆ బాలిక కుటుంబం పోలీసు స్టేషన్కు వెళ్లితే వారు తిరస్కరించారు. తల్లిదండ్రులను బయటకు పంపించి బాలికను తీవ్రంగా కొట్టారు. ఆ రాత్రంగా స్టేషన్లోనే ఉంచుకున్నారు.
భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. అత్యాచారానికి గురైన ఓ బాలిక రేప్ కేసు పెట్టడానికి పోలీసు స్టేషన్కు వెళ్లింది. అక్కడ పోలీసులు ఆమెకు అండగా నిలబడకపోగా వారూ శత్రు వైఖరి అవలంభించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయకపోవడమే కాదు.. ఆ బాలికను బాదారు. రాత్రంతా పోలీసు స్టేషన్లోనే ఉంచుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ నగరంలో చోటుచేసుకుంది. ఆగస్టు 30వ తేదీన ఈ ఘటన జరిగినట్టు తెలుస్తున్నది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.
బాలిక తల్లి తెలిపిన వివరాల ప్రకారం, 13 ఏళ్ల తన కూతురు ఇంటి బయట ఆడుకోవడానికి వెళ్లింది. ఆగస్టు 27న ఆమె బయటకు వెళ్లి మళ్లీ రాలేదు. ఆమె తండ్రి మిస్సింగ్ పర్సన్ కంప్లైంట్ను పోలీసు స్టేషన్లో ఆ తర్వాతి రోజే అందించాడు. ఆగస్టు 30న ఆ బాలిక తిరిగి ఇంటికి చేరుకుంది. తనను బాబు ఖాన్ అనే వ్యక్తి బలవంతంగా అతని ఇంటికి తీసుకెళ్లినట్టు వివరించింది. ఆ ఇంటిలోనే ఆమెను బంధించి మూడు రోజులు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు భోరుమంది.
అనంతరం, వారు పోలీసు స్టేషన్ వెళ్లారు. బాబు ఖాన్పై రేప్ కేసు పెట్టాలని ఫిర్యాదు చేశారు. కానీ, ఇద్దరు పోలీసులు తన కూతురు స్టేట్మెంట్ మార్చుకోవాలని ఒత్తిడి చేశారని ఆమె తెలిపారు. వారు తన కూతురిని కొట్టారని వివరించారు. మరో పోలీసు అధికారి తనను బయటకు తీసుకెళ్లారని, తన కూతురిని తీవ్రంగా కొట్టారని, బెల్టుతోనీ బాదారని పేర్కొన్నారు. ఆ బాలికను స్టేషన్లోనే ఉంచుకున్నారని, ఆమె తల్లిదండ్రులను స్టేషన్ బయట ఉండిపోయారని సమాచారం.
ఆ తర్వాతి రోజు కూడా మరోసారి స్టేషన్ వెళ్లి రేప్ కేసు పెట్టాలని కోరగా వారిని బయటకు పంపించివేసినట్టు ఆమె ఆరోపించారు. చివరకు సెప్టెంబర్ 1న రేప్ కేసు పెట్టారని, కానీ, కిడ్నాప్ ఆరోపణలు అందులో ప్రస్తావించలేదని ఆమె పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో బాలిక వయసు 17 సంవత్సరాలుగా మెన్షన్ చేశారని తెలిపారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆ గ్రామం పర్యటించి వివరాలు సేకరించింది. పోలీసుల లోపాన్ని ఎత్తి చూపింది. వీరి నుంచి ఫిర్యాదు అందిందని జాయింట్ కలెక్టర్ ప్రతాప్ సింగ్ చౌహాన్ తెలిపారు.