గాఢంగా ప్రేమించుకున్నారు.. జీవితంలో స్థిరపడి పెద్దలను పెళ్లికి ఒప్పించారు.. కానీ, ఒక్క ప్రమాదం...!

By Mahesh KFirst Published May 16, 2022, 5:13 PM IST
Highlights

కర్ణాటకలో ధనుష్, సుష్మ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. జీవితంలో స్థిరపడ్డారు. ఒక ప్లాన్ ప్రకారం తమ కాళ్లపై నిలబడ్డారు. పెళ్లికి అడ్డుచెప్పిన పెద్దలను పట్టుబట్టి ఒప్పించారు. కానీ, ఒక్క ప్రమాదంతో వారిరువురి జీవితాలు ధ్వంసం అయ్యాయి. ధనుష్ యాక్సిడెంట్‌లో మరణించడాన్ని తట్టుకోలేక సుష్మ ఆత్మహత్య చేసుకుంది.
 

బెంగళూరు: గాఢంగా ప్రేమించుకున్న జంటల ఎన్నో ఉన్నాయి. కానీ, ఆ ప్రేమను పెళ్లి దాకా తెచ్చుకున్న జంటలు చాలా తక్కువ. తమ కాళ్లపై నిలబడి.. స్థిరపడి.. పెద్దలను పెళ్లికి ఒప్పించేదాకా వచ్చే జంటలు మరీ అరుదు. కానీ, కర్ణాటకలోని ఓ జంట ఇక్కడిదాకా వచ్చింది. ఒకరినొకరు చచ్చేంత ప్రేమించుకునేడు కాదు.. ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి అహర్నిశలు శ్రమించారు. జీవితంలో స్థిరపడ్డారు. అడ్డువచ్చిన పెద్దలనూ పట్టుబట్టి ఒప్పించారు. ఇక రేపో మాపో పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయంలో విధి వంచించింది. వారి ప్రేమను ఒకే ఒక్క ప్రమాదం దారుణంగా ముగించింది.

కర్ణాటకలోని తుమకూరు జిల్లా ముస్కల్ గ్రామానికి చెందిన ధనుష్, హసన్ జిల్లా బేలూరు తాలూకాలోని ఆరేహళ్లి గ్రామానికి చెందిన సుష్మలు రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణమిచ్చేంత ప్రేమ. సుష్మ ఎంకామ్ చదివింది. ధనుష్ బెంగళూరులో ఓ క్లాత్ షోరూం నిర్వహిస్తున్నాడు. రెండేళ్ల ప్రేమలోనే వారు భవిష్యత్‌ గురించి ఎన్నో కలలు కన్నారు. అంతేకాదు, ఆ కలలను కార్యరూపం దాల్చడానికి ఎంతో కష్టపడ్డారు. అందులో నుంచే ధనుష్ సొంతకాళ్ల నిలబడే దాకా వెళ్లాడు. క్లాత్ షోరూం నడుపుకున్నాడు.

జీవితంలో స్థిరపడటంతో వారిద్దరూ ఏకం కావాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఇక వారి ప్రేమను గుట్టుగా ఉంచాలని అనుకోలేదు. జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం, ప్రణాళికలు వారికి ఉన్నాయి. ఈ ధైర్యంతోనే వారు తమ పెళ్లి ప్రతిపాదనను పెద్దల ముందుకు తెచ్చారు.

వారిద్దరి కుటుంబాలు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ, వారు వారించడానికి, అడ్డు చెప్పడానికి పెద్దగా కారణాలు లేకపోయాయి. చివరకు ధనుష్, సుష్మల పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. పట్టుబట్టి వీరిద్దరూ పెళ్లికి పెద్దలను ఒప్పించగలిగారు. ఈ ఘట్టం ఆ ప్రేమికుల్లో జీవితాన్నే జయించినంత ఆనందాన్ని నింపింది. ఇక వారి పెళ్లికి అడ్డేమీ లేదు. రెండేళ్లుగా తమ జీవిత భాగస్వాములుగా కలలు గంటున్న ఆ ఇద్దరు రేపో మాపో ప్రపంచానికి తమ నిర్ణయాన్ని ప్రకటించడానికి సిద్ధం అయ్యారు. కానీ, అంతలోనే ఓ ప్రమాదం వారి జీవితాలను ధ్వంసం చేసింది.

ధనుష్ సొంత ఊరులో ఓ జాతర జరిగింది. ఆ జాతరలో పాల్గొనాలని మే 11వ తేదీన ధనుష్ తన టూ వీలర్‌పై ఇంటికి బయల్దేరాడు. కానీ, కులనహళ్లి వద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో ధనుష్ ప్రాణాలు పోయాయి. ఈ విషయం తెలిసి ధనుషే ప్రపంచంగా ఉన్న సుష్మా కుప్పకూలింది. ఒక్కసారిగా ఆమె జీవితాన్ని చీకట్లు కమ్మేసినట్టుగా, అంతా తలకిందులు అయినట్టుగా విలవిల్లాడింది.

ఆమెకు తన భవిష్యత్ నిండా అంధకారమే కనిపించింది. ధనుష్ మరణంతో సుష్మా తీవ్ర మనస్థాపానికి లోనైంది. కళ్లు మూసినా.. తెరిచినా ధనుష్ మరణాన్ని జీర్ణించుకోలేక వేదన పడింది. గుండెలవిసేలా రోధించింది. ధనుష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కానీ, ఆమె మనసులో నుంచి ధనుష్‌ను పక్కనపెట్టలేకపోయింది. మే 14న సుష్మ కఠిన నిర్ణయం తీసుకుంది. విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రియుడే ఆరో ప్రాణంగా బతికిని సుష్మ తన ప్రాణాలనూ విడిచిపెట్టింది. ఒక్క యాక్సిడెంట్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆ జంట ప్రాణాలనే కోల్పోయారు. రెండు కుటుంబాలూ తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

click me!