Breaking: రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరణ.. నోటిఫికేషన్ విడుదల..

Published : Aug 07, 2023, 10:31 AM ISTUpdated : Aug 07, 2023, 10:49 AM IST
Breaking: రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరణ.. నోటిఫికేషన్ విడుదల..

సారాంశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరించారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరించారు. ‘‘మోదీ’’ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు విధించిన జైలు శిక్షపై సుప్రీం కోర్టు శుక్రవారం (ఆగస్టు 4) స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాహుల్ గాంధీ తిరిగి లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. ఇక, మోదీ పేరు వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో సూరత్ కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో మార్చి 24న లోక్‌సభ సభ్యుడిగా అనర్హత వేటు పడింది. 

అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఎంపీగా  గెలుపొందారు. అయితే కర్ణాటకలోని కోలార్‌లో 2019 ఎన్నికల ప్రచారం భాగంగా మోదీ ఇంటి పేరుపై చేసిన  వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ ఆయనపై క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు.. ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మరుసటి రోజే ఆయన లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలోనే ఆయన తన అధికారిక బంగ్లాను కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. 

మరోవైపు రాహుల్ గాంధీ తన నేరారోపణను నిలిపివేయాలనే అభ్యర్థనతో పాటు సెషన్స్ కోర్టులో ఆ ఉత్తర్వులను సవాలు చేశారు. సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న అతనికి బెయిల్ మంజూరు చేసింది. అతని సవాలును వినడానికి అంగీకరించింది. అయితే ఆ తర్వాత నేరారోపణపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తర్వాత రాహుల్ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. తనకు విధించిన శిక్షను సస్పెండ్ చేసేందుకు సెషన్ కోర్టు నిరాకరించడాన్ని సమర్థిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాహుల్ గాంధీ జూలై 15న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే సూరత్‌ కోర్టు రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై సుప్రీం కోర్టు శుక్రవారం (ఆగస్టు 4) స్టే విధించింది. సూరత్ కోర్టులోని ట్రయల్ జడ్జి రెండేళ్ల గరిష్ట శిక్ష విధించడానికి తగిన కారణాలను అందించలేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.ట్రయల్ జడ్జి ఈ కేసులో గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్షను విధించారని.. శిక్ష ఒక రోజు తక్కువగా ఉంటే ఎంపీగా అనర్హత వేటు పడి ఉండేది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక, ఈ వార్త తెలియగానే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు, సోనియా గాంధీ నివాసం వెలుపల సంబరాలు జరిగాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?