లాక్‌డౌన్ విధించం... కరోనాతో సహన జీవనం చేయాల్సిందే: ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి

By Siva KodatiFirst Published Mar 27, 2021, 4:09 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడ మరోసారి లాక్‌డౌన్ విధిస్తారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. నెమ్మదించిందనుకున్న వైరస్ గడిచిన కొన్ని వారాలుగా పంజా విసురుతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే పలు నగరాల్లో లాక్‌డౌన్ విధించగా.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ కూడా ప్రకటించారు.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడ మరోసారి లాక్‌డౌన్ విధిస్తారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించే అంశంపై క్లారిటీ ఇచ్చారు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్. నగరంలో లాక్‌డౌన్  విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు.  21 రోజుల పాటు అన్ని కార్యకాలాపాలకు దూరంగా ఉంటే కరోనా వ్యాప్తి ఆగిపోతుందని ఇప్పటికే తాము చెప్పామని సత్యేంద్ర జైన్ గుర్తుచేశారు.

లాక్‌డౌన్ అనేది వైరస్ కట్టడికి శాశ్వత పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు కరోనాతో సహజీవనం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. వయస్సును బట్టి ఎప్పుడు వ్యాక్సినేషన్‌కు అనుమతిస్తే అప్పుడు ప్రజలంతా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సత్యేంద్ర జైన్ విజ్ఞప్తి చేశారు.
 

click me!