పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. గతపార్లమెంటు సమావేశాల్లోనూ పెగాసెస్, రైతు సమస్యలపై ధర్నాలు చేయగా.. ఈ సారి కూడా కనీస మద్దతు ధర, రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్పై నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాజ్యసభలో ఆందోళనలు మాత్రం తీవ్రంగా జరుగుతున్నాయి. గతవారంలో రాజ్యసభలో ఆందోళనలు, ఇతర అంతరాయాల కారణంగా 52 శాతం వృథాగా పోయినట్టు పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ: ప్రజా ప్రతినిధులకు చట్ట సభల సమావేశ సమయం చాలా కీలకం. ప్రజల సమస్యలపై ప్రజా ప్రతినిధులు కలిసి చర్చించే వేదిక అది. దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గ ప్రతినిధులు Parliamentలో సమావేశమవుతారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలను ఆ సమావేశాల్లో చర్చించడం, పరిష్కారాలను సూచించడం, ప్రజా ప్రయోజన చట్టాలను రూపొందించడంలో కీలకమైనవి. అలాంటి చట్ట సభల సమయాన్ని వృథా చేయడమంటే ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టడమేనని విశ్లేషకులు చెబుతుంటారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో గత వారం Rajyasabha సమావేశ సమయంలో 52శాతం వృథా అయినట్టు వెల్లడించడం చర్చనీయాంశమైంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ విపక్షాలు(Opposition) ఆందోళనల బాట పట్టిన సంగతి తెలిసిందేన.
ముఖ్యంగా రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళన తీవ్రంగా సాగుతున్నది. గత పార్లమెంటు సమావేశాల చివరి రోజున 12 రాజ్యసభ ఎంపీల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉన్నదని చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అందుకు అంగీకరించలేదు. రాజ్యసభ ప్రతిష్టను దెబ్బతీసేలా బల్లలు ఎక్కి, నల్ల జెండాలు ఊపిన గందరగోళాన్ని సృష్టించిన ఆ ఎంపీలు కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని అన్నారు. వారు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తే అప్పుడు వారిపై సస్పెన్షన్ ఎత్తివేతను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
Also Read: పెగాసస్.. ఎన్ఎస్ వో నిషేధంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. సస్పెండ్ అయిన ఎంపీలు క్షమాపణలు చెబితే వారిపపై విధించిన వేటును ఎత్తేస్తామని వెల్లడించింది. కానీ, ప్రతిపక్షాలు మాత్రం క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేశాయి. రోజు ఉదయం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర వారు ధర్నాలు చేస్తున్నారు. వారి ధర్నాకు మద్దతుగా ఇతర ప్రతిపక్ష ఎంపీలు కూడా అక్కడికి చేరుతున్నారు. సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఇతర అంశాలతోపాటు ఈ సస్పెన్షన్ వేటుపై ప్రతిపక్షాలు రాజ్యసభలో గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో చర్చ చాలా వరకు తగ్గిపోయింది. బిల్లులపై చర్చ, వాటి ఆమోదం గత వారంలో అతి స్వల్ప స్థాయిలో జరిగాయి.
గతవారం రాజ్యసభలో షెడ్యూల్డ్ సమావేశ కాలంలో 52శాతం ఆందోళనలు, అంతరాయాల కారణంగా వృథాగా పోయిందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటన వెల్లడిస్తున్నది. గతవారం ఉత్పాదక సమయం కేవలం 47.70 శాతమేనని ఆా ప్రకటన తెలిపింది. కాగా, అయితే, గురువారం షెడ్యూల్డ్ సమయం కంటే కూడా మరో 33 నిమిషాలు అదనంగా సభ్యులు సమావేశంలో కూర్చున్నట్టు వివరించింది. తద్వారా మొత్తంగా వారంలో ప్రాడక్టివిటీ 49.70 శాతానికి పెరిగినట్టు వివరించింది. గురు, శుక్ర వారాల్లో అత్యధిక ప్రాడక్టివిటీ రిపోర్ట్ అయింది. గురువారం 95శాతం, శుక్రవారం 100 శాతం ప్రాడక్టివిటీ నమోదైనట్టు తెలిపింది.
పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలివారంలో మూడు సాగు చట్టాలను రద్దు చేసే బిల్లు, డ్యామ్ సేఫ్టీ బిల్లును రాజ్యసభ పాస్ చేసింది. సాగు చట్టాల రద్దుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు తొలి రోజే ఉభయ సభల్లోనూ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.