లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనలో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యతిరేకించింది.
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో చోటుచేసుకున్న హింసాకాండ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యతిరేకించింది. ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టగా.. ప్రభుత్వం దానిని వ్యతిరేకిస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ గరిమా ప్రషాద్ చెప్పారు. ఆ నేరాన్ని ఘోరమైనదిగా, హేయమైనదిగా పేర్కొన్నారు. ఇది ఘోరమైన నేరమని.. సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతుందని అన్నారు.
ఇక, 2021 అక్టోబర్ 3 లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికునియాలో అప్పటి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను రైతులు నిరసిస్తున్నప్పుడు చెలరేగిన హింసలో ఎనిమిది మంది మరణించారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. నలుగురు రైతులను ఎస్యూవీతో ఢీకొట్టారు. అందులో ఆశిష్ మిశ్రా కూర్చున్నారు. ఈ సంఘటన తర్వాత ఆగ్రహం చెందిన స్థానికులు ఒక డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. హింసాకాండలో ఓ జర్నలిస్టు కూడా మరణించారు.