
Kerala-Bharat Jodo Yatra: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ దేశవ్యాప్త "భారత్ జోడో యాత్ర"ను ప్రారంభించారు. ఈ మెగా ర్యాలీ 150 రోజుల పాటు.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగనుంది. దీనికి ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే, కేరళలో భారత్ జోడో యాత్ర కోసం కాంగ్రెస్ నాయకులు చేపట్టిన విరాళాల సేకరణ నేపథ్యంలో తమపై దాడి చేశారని ఓ కూరగాయల దుకాణ యజమాని ఆరోపించారు. నిధుల సేకరణకు క్రమంలో రెండు వేల రూపాయలు ఇవ్వాలని తనను బెదిరించాడని పేర్కొన్నారు. సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో వెలుగుచూశాయి. అయితే, వీటిని ధృవీకరించాల్సి ఉంది.
ఏఎన్ఐ నివేదికల ప్రకారం.. కేరళలోని కొల్లాంలో 'భారత్ జోడో యాత్ర' కోసం నిధుల సేకరణలో రూ. 2000 ఇవ్వనందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కూరగాయల దుకాణ యజమానిని బెదిరించారు అని నివేదించింది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలోని పలు స్క్రీన్షాట్ లను పంచుకుంవది.
అలాగే, కాంగ్రెస్ కార్యకర్తల బృందం దుకాణానికి చేరుకుని 'భారత్ జోడో యాత్ర' కోసం విరాళాలు అడిగారు. నేను రూ.500 ఇచ్చాను కానీ రూ.2000 డిమాండ్ చేశారు.. తూకం మిషన్లను పాడుచేసి కూరగాయలు విసిరేశారు అని కూరగాయల దుకాణ యజమాని ఎస్ ఫవాజ్ చెప్పినట్టు ఏఎన్ఐ నివేదించింది. ఈ ఘటనపై దుకాణదారుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
ఇదిలావుండగా, రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు సాగుతున్న భారత్ జోడో యాత్ర నేపథ్యంలో కాంగ్రెస్-బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పిస్తూ.. రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు సంధించారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నదని పేర్కొన్న ఆయన.. దేశ భవిష్యత్తు భద్రంగానే ఉందా? అని ప్రశ్నించారు. లౌకికతత్వాన్ని పెంపొందించడం, బీజేపీ విభజన రాజకీయాలను ఎండకడుతూ దేశాన్ని ఏకం చేయడానికి తమ యాత్ర కొనసాతుందనీ, ప్రజల తరఫున పోరాటం సాగిస్తూ ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తామని రాహుల్ అన్నారు. భారత్ జోడో యాత్ర నేపథ్యంలో మరోసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ.. ఒక ట్వీట్లో ఆయన ఒక ఫోటోను పంచుకున్నారు.. మన యువతలో 42% నిరుద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. భారత్ భవిష్యత్తు భద్రమేనా? అంటూ ప్రశ్నించారు. ఆలాంటి నిరుద్యోగుల కోసం.. ప్రజల కోసం, ఉద్యోగాల కోసం తాము ముందుండి పోరాటానికి నడుస్తామని తెలిపారు. వారికి అండగా ఉంటామని స్ఫష్టం చేశారు.