
కోల్కత్తా: పెళ్లైన తొమ్మిదేళ్ల తర్వాత ఆమె మహిళ కాదని పురుషుడుగా తేలింది. దీంతో భర్తతో పాటు కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. భార్యాభర్తలకు వైద్యులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతాలోని బీర్ భమ్ కు చెందిన ముప్పై ఏళ్ల మహిళ కడుపు నొప్పితో కొద్ది నెలల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లింది.
వైద్యులు ఆమెను పరీక్షించారు. బాధితురాలు వృషణ క్యాన్సర్ బారినపడినట్టుగా తేల్చారు. అంతేకాదు మెడికల్ రిపోర్టులో ఆమె కాదు అతడుగా వైద్యులు తేల్చారు. సాధారణంగా మహిళల్లో ఎక్స్ ఎక్స్ (xx) క్రోమోజోములుంటాయి. కానీ ఆమెలో పురుషులకు ఉన్నట్టుగా ఎక్స్ వై(xy) క్రోమోజోములు ఉన్నట్టుగా గుర్తించారు.
ఆమె చూడటానికి అచ్చంగా మహిళలాగే కనిపిస్తుంది. గొంతుతో పాటు అన్ని అవయవాలు అమ్మాయిలానే ఉంటాయి. శరీరంలోనూ మహిళల్లో ఉండే అన్ని హార్మోన్లు ఉన్నాయని డాక్టర్ దత్తా తెలిపారు. వీటి వల్లే ఆమెకు స్త్రీ రూపం వచ్చిందన్నారు. అయితే ఆమెలో పుట్టుకతోనే గర్భాశయం, అండాశయం లేవని ఆయన తేల్చి చెప్పారు.
దీని వల్ల ఆమెకు ఇప్పటికీ రుతుస్రావం జరగలేదన్నారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయని ఆయన తెలిపారు. 22 వేల మందిలో ఒక్కరికి ఇలా జరుగుతుందని తెలిపారు.
ప్రస్తుతం ఆమెకు కీమోథెరపీ చేస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. కాగా ఆమె పెళ్లి చేసుకుని 9 సంవత్సరాలు అవుతుండగా వీరికి పిల్లలు లేరు. దీని గురించి ఆమెకు, ఆమె భర్తకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని వైద్యులు తెలిపారు.
ఆమె 28 ఏళ్ల సోదరికి "ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్" ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంటే జన్యుపరంగా అబ్బాయిలా జన్మించినప్పటికీ, పైకి మాత్రం అమ్మాయిలాగే కనిపిస్తుంది. వీరి రక్త సంబంధీకుల్లో ఇద్దరికి ఇలాంటి వ్యాధి ఉండటం వల్లే జన్యువుల ద్వారా వీరికి వ్యాపించిందని డా. దత్త వివరించారు.