
నాగుపాము కాటుకు గురైన కేరళకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్ ( Vava Suresh) కోలుకున్నారు. సోమవారం ఆయన కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రి నంచి డిశ్చార్జ్ అయ్యారు. పాము కాటుకు గురికావడంతో ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాజాగా ఆరోగ్యం మెరుగుపడటంతో ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా వావా సురేష్ తనను ఆస్పత్రికి తరలించినవారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా తనకు చికిత్స అందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది తనకు రెండో జన్మ అని చెప్పారు.
అంతేకాకుండా తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన కేరళ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘ఇది నా రెండవ జన్మ. నేను పాములను పట్టే పద్ధతిని మార్చుకోవడం గురించి ఆలోచిస్తాను. ఒక ఫారెస్ట్ అధికారి నాపై మళ్లీ కుట్ర పన్నుతున్నాడని నేను వెల్లడించాలనుకుంటున్నాను’ అని సురేష్ ఆసుపత్రి నుండి బయలుదేరినప్పుడు మీడియాతో అన్నారు. తాను ఇదే వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు. సురేష్ డిశ్చార్జ్ ప్రక్రియకు ముందు కేరళ మంత్రి ఎన్ వాసవన్ సోమవారం ఉదయం ఆస్పత్రికి చేరుకుని అతనితో మాట్లాడారు.
"
ఇక, కేరళలో స్నేక్ క్యాచర్ గా పేరు గాంచిన సురేష్ ఇప్పటివరకు 50,000లకు పైగా పాములను రక్షించారు. సురేష్ నేషనల్ జియోగ్రాఫిక్, యానిమల్ ప్లానెట్ ఛానెల్ లలో కూడా పలు వీడియోలు చేశారు. సురేష్ని ముద్దుగా ‘Snake man of Kerala’గా పిలుస్తున్నారు. సురేష్ 190కి పైగా కింగ్ కోబ్రాలను రక్షించారు. జనవరి 31వ తేదీన వావా సురేష్ తన వృత్తిలో భాగంగా సోమవారం Kurichi గ్రామంలో ఓ పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. దానిని పట్టుకుని గోనెసంచిలో వేస్తుండగా అది అతని మోకాలిపై కాటేసి తప్పించుకునేందుకు ప్రయత్నించింది.
ఏడున్నర అడుగులు ఉన్న ఆ త్రాచు పాము సురేష్ కుడి కాలి మోకాలి వద్ద కాటేసింది. అయితే పాము కాటును లెక్కచేయకుండా సురేష్ ఆ పామును సంచిలో వేశాడు. వెంటనే కిందపడిపోయాడు.. దీంతో అది గమనించిన స్థానికులు అతనిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో పరిస్థితి విషమంగా కొట్టాయం మెడికల్ కాలేజ్కు తరలించారు. ఇక, ఇప్పటివరకు తనను 250 సార్లు పాము కాటుకు గురయ్యానని సురేష్ ఓ సందర్భంలో చెప్పారు.