
కేరళలోని కొచ్చిలో ఓ నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఏడేళ్ల చిన్నారికి ఓ నర్సు యాంటి రేబిస్ ఇంజెక్షన్ ఎక్కించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే చిన్నారికి యాంటీ రేబిస్ ఇంజక్షన్ ఇచ్చిన నర్సును విధుల నుంచి తప్పించాలని ఆదేశించింది.
సమాచారం ప్రకారం.. ఈ ఘటన ఎర్నాకులం, కొచ్చి సమీపంలోని అంగమాలిలోని తాలూకా ఆసుపత్రికి చోటుచేసుకుంది. ఆగస్టు 11న జ్వరంతో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారిని బంధువులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి చేరుకున్న తరువాత.. డాక్టర్ పరీక్షించి.. రక్త పరీక్షలు చేయాలని సూచించారు. దీంతో చిన్నారి బంధువులు ఆస్పత్రిలోనే ఏర్పాటు చేసిన ల్యాబ్కు చేరుకుని చిన్నారిని ఆరుబయట కూర్చోబెట్టి బిల్లు చెల్లించడం ప్రారంభించారు.
కొద్దిసేపటికే ఒక నర్సు వచ్చి ఆ చిన్నారి వివరాలను అడగకుండానే ఆ చిన్నారికి యాంటీ రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చింది. అప్పటికి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఇంజక్షన్ గురించి అడగగా.. సమాధానం విని షాక్ అయ్యారు. కుక్క, పిల్లి, కోతి తదితర జంతువులు కరిచిన వారికి వేసే యాంటీ రేబిస్ ఇంజెక్షన్ ను చిన్నారికి వేసినట్టు గుర్తించారు. నర్సు పొరపాటున చిన్నారికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నర్సు నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చిన్నారి తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఈ విషయమై తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా.. రేబిస్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నర్సుపై చర్యలు తీసుకోవాలని చిన్నారి బంధువులు డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వైద్యుల పర్యవేక్షణలో చిన్నారి..
చిన్నారిని అబ్జర్వేషన్లో ఉంచామని, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య తల్లెత్తలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ ఆసుపత్రిలో కాంట్రాక్టుపై పనిచేస్తున్న నర్సు సర్వీస్ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.