ఏసియానెట్ న్యూస్ ఉద్యోగులపై నమోదైన పోక్సో కేసును కేరళ హైకోర్టు కొట్టివేసింది. ఉద్యోగులపై ఆరోపణలు నిరాధారమని, అభియోగాలు సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది.
కేరళ హైకోర్టులో ఏసియానెట్ న్యూస్ ఉద్యోగులకు ఊరట లభించింది. ఓ న్యూస్ కవరేజ్ విషయంలో పోలీసులు నమోదుచేసిన పోక్సో కేసును హైకోర్టు కొట్టివేసింది. ఉద్యోగులకు చేసిన ఆరోపణలు నిరాధరమైనవిగా న్యాయస్థానం పేర్కొంది. ఇలా ఏసియానెట్ న్యూస్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి చార్జిషీట్ను కొట్టివేసారు.
ఏసియా నెట్ ఉద్యోగులపై పోక్సో, జువెనైల్ జస్టిస్ చట్టం కింద రాష్ట్ర పోలీసులు మోపిన అభియోగాలు సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది. అలాగే నేరపూరిత కుట్ర, మోసం, తప్పుడు ఎలక్ట్రానిక్ పత్రాలను రూపొందించడం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అభియోగాలు ఉద్యోగులపై మోపగా... ఇందుకు ఆధారాలేమీ లేకపోవడంతో కోర్టు కొట్టివేసింది.
హైకోర్టు తీర్పుతో ఆరుగురు ఏసియా నెట్ ఉద్యోగులు విడుదలయ్యారు. వీరిలో ఏసియానెట్ న్యూస్ మేనేజింగ్ ఎడిటర్ సింధు సూర్యకుమార్, రెసిడెంట్ ఎడిటర్ కె. షాజహాన్, రిపోర్టర్ నౌఫల్ బిన్ యూసుఫ్, వీడియో ఎడిటర్ వినీత్ జోస్, సినిమాటోగ్రాఫర్ విపిన్ మురళి ఉన్నారు.
కేసును విచారించడానికి తగిన ఆధారాలు లేవని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ప్రజా ప్రయోజనార్థం మాదకద్రవ్యాల దుర్వినియోగంపై వార్తా ధారావాహికను ప్రసారం చేసినందుకు ఏసియానెట్ న్యూస్ను కోర్టు ప్రశంసించింది.