
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన తాజా ప్రీ-ఎలక్షన్ సర్వే రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో అధికార మార్పు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమిని వెనక్కి నెట్టి యూడీఎఫ్ కూటమి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశముందని సర్వే తెలిపింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో యూడీఎఫ్ 81 నుంచి 86 స్థానాలు గెలుచుకునే అవకాశముందని అంచనా. అధికార కూటమి ఎల్డీఎఫ్కు 51 నుంచి 59 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 0 నుంచి 2 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉందని అంచనా.
సర్వే ప్రకారం ప్రధాన కూటముల ఓటు శాతం ఇలా ఉండొచ్చని అంచనా:
యూడీఎఫ్: 43% – 45% ఓట్లు
ఎల్డీఎఫ్: 39% – 41% ఓట్లు
ఎన్డీఏ: 13% – 15% ఓట్లు.
ఈ అంచనాల ప్రకారం యూడీఎఫ్కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది.
ప్రస్తుత ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి ఎల్డీఎఫ్కు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా పలు వివాదాలు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీశాయని అభిప్రాయం వ్యక్తమైంది.
శబరిమల స్వర్ణ స్మగ్లింగ్ కేసు వంటి అంశాలు ప్రజల్లో ప్రతికూల భావనను పెంచాయని సర్వే విశ్లేషించింది. అలాగే రైతుల సమస్యలు, ముఖ్యంగా రబ్బరు రైతుల ఆందోళనలు కూడా ప్రభావం చూపే అవకాశముంది. అడవి జంతువుల దాడులు, కొండ ప్రాంతాల్లో రైతుల అసంతృప్తి కూడా ఎల్డీఎఫ్ ఓట్లలో తగ్గుదలకు కారణమయ్యే అవకాశం ఉందని అంచనా. దక్షిణ కేరళలో సంప్రదాయంగా ఎల్డీఎఫ్కు మద్ధతు ఇచ్చే వర్గాల్లో కూడా అసంతృప్తి పెరుగుతోందని సర్వే తెలిపింది. ముఖ్యంగా వరి రైతులు, కాజూ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొంది.
ముస్లిం లీగ్ మద్ధతు ఉన్న ప్రాంతాల్లో యూడీఎఫ్ బలంగా నిలబడే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అలాగే క్రైస్తవ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశముందని అంచనా. వివిధ సామాజిక వర్గాల ఓట్లు యూడీఎఫ్ వైపు ఏకీకృతం కావడం కూడా కూటమికి లాభం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషించారు.
ఉత్తర కేరళ:
ఉత్తర కేరళలోని మలప్పురం వంటి జిల్లాల్లో యూడీఎఫ్ భారీ ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. అయితే కన్నూర్, పాలక్కాడ్ ప్రాంతాల్లో ఎల్డీఎఫ్ బలం కొనసాగవచ్చని అంచనా.
మధ్య కేరళ:
త్రిసూర్, ఎర్నాకులం జిల్లాల్లో యూడీఎఫ్కు మంచి అవకాశాలు ఉన్నట్లు సర్వే తెలిపింది. క్రైస్తవ ఓటర్ల సపోర్ట్ కీలకంగా మారే అవకాశం ఉంది. కొన్ని పార్టీల అంతర్గత విభేదాలు కూడా ప్రభావం చూపవచ్చని పేర్కొంది.
దక్షిణ కేరళ:
దక్షిణ కేరళలో ఎల్డీఎఫ్ కొంత బలంగా ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో యూడీఎఫ్ ఆధిక్యం సాధించే అవకాశం ఉందని సర్వే తెలిపింది. ముఖ్యంగా పథనం తిట్ట ప్రాంతంలో యూడీఎఫ్ ముందంజలో ఉండొచ్చని అంచనా.
బీజేపీ ప్రభావం తిరువనంతపురం పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావచ్చని సర్వే పేర్కొంది. కొన్ని చోట్ల బీజేపీ పెరుగుదల పరోక్షంగా యూడీఎఫ్కు లాభం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషించింది.