
మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కర్ణాటకలోని మురుగ మఠం ప్రధాన పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణారు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అతడిని స్థానిక కోర్టులో హాజరుపరిచి జ్యూడీషియల్ కస్టడీకి పంపారు. అయితే జైలులో శివమూర్తికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అతడిని చిత్రదుర్గలోని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. గురువారం అర్థరాత్రి అరెస్టు చేసిన తర్వాత శివమూర్తి చాలా గంటలపాటు పోలీసులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే శుక్రవారం ఉదయం జైలుకు పంపిన వెంటనే అతనికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు సమాచారం. దీంతో అతడిని పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇక, ఇద్దరు హైస్కూల్ బాలికలను లైంగికంగా వేధించినందుకు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంతో పాటు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేశారు. గత రాత్రి అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు శివమూర్తికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు చిత్రదుర్గ పోలీసు సూపరింటెండెంట్ కె పరశురాం విలేకరులకు తెలిపారు. అనంతరం అతన్ని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లినట్టుగా చెప్పారు. తరువాత జిల్లా జైలుకు పంపినట్టుగా వెల్లడించారు. తదుపరి విచారణ కోసం నిందితుడి కస్టడీ కోసం పోలీసులు దరఖాస్తు చేసుకుంటారని పరశురాం తెలిపారు.
లైంగిక వేధింపుల ఆరోపణలపై శివమూర్తి స్పందించారు. ఎంతో కాలంగా తనపై జరుగుతున్న కుట్ర ఫలితమే ఈ అత్యాచారా ఆరోపణలను అని అన్నారు. అయితే శివమూర్తితో పాటు మరో నలుగురిపై నమోదైన కేసును ప్రస్తుతం కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్ట్కు కొన్ని గంటల ముందు.. కర్ణాటక పోలీసులు శివమూర్తిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లొద్దని పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యగా నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.
ఇక, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో శివమూర్తి ముందస్తు బెయిల్ కోసం చిత్రదుర్గలోని స్థానిక కోర్టులో పిటిటిషన్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.