
కర్ణాటక : కొత్తగా ఏర్పడిన సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని ఆదివారం సస్పెండ్ చేశారు. చిత్రదుర్గంలోని హొసదుర్గంలోని కానుబెన్నహళ్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శాంతమూర్తి ఎంజీ అనే ఉపాధ్యాయుడు రాష్ట్ర ప్రభుత్వంపైనా, ఉచితాలపైనా విమర్శలు గుప్పించారు.
‘ఫ్రీబీస్ ఇవ్వడం తప్ప ఇంకేం చేయగలం’ అని శాంతమూర్తి ఫేస్బుక్ పోస్ట్లో రాసుకొచ్చాడు. అంతేకాదు అతను తన పోస్ట్లో, వివిధ ముఖ్యమంత్రుల హయాంలో ఎంతెంత అప్పు చేశారో వివరంగా రాసుకొచ్చాడు.
‘‘మాజీ సీఎంల హయాంలో.. ఎస్ఎం కృష్ణ రూ.3,590 కోట్లు, ధరమ్సింగ్ రూ.15,635 కోట్లు, హెచ్డీ కుమారస్వామి రూ.3,545 కోట్లు, బీఎస్ యడ్యూరప్ప రూ.25,653 కోట్లు, డీవీ సదానందగౌడ రూ.9,464 కోట్లు, జగదీశ్ షెట్టర్ రూ.2 కోట్లు, సిద్ధరామయ్య రూ.41 కోట్లు.. 42,000 కోట్లు” అని శాంతమూర్తి పోస్ట్లో పేర్కొన్నాడు.
గోమూత్రంతో కర్నాటక విధాన సౌధను శుద్ధి చేసిన కాంగ్రెస్.. బీజేపీ అవినీతి పాలన అంతమంటూ వ్యాఖ్య
ఇది కొత్తగా ఏర్పడే ప్రభుత్వాన్ని విమర్శించడమేనని.. ఈ మేరకు క్షేత్ర విద్యాశాఖాధికారి ఎల్.జయప్ప శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. "శనివారం కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో గత ప్రభుత్వాల హయాంలో చేసిన అప్పులను ప్రస్తావించడం ద్వారా ఉపాధ్యాయుడు శాంతమూర్తి ప్రభుత్వ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారు. అందుకే ఆయనను సస్పెండ్ చేశాం" అని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో తెలిపారు.