
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే బసవరాజ్ బొమ్మై రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. రైతు కుటుంబాల పిల్లలకు రూ.1000 కోట్లతో ఉపకార వేతనాలు చెల్లించనున్నట్టు ప్రకటించారు. అలాగే, పింఛన్ల కింద ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచుతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు వృద్ధాప్య పింఛన్ను రూ.1000 నుంచి రూ.1200 లకు పెంచడంతో పాటు వితంతువులు, దివ్యాంగుల పింఛన్లను రూ. 600 నుంచి రూ.800లకు పెంచుతున్నట్టు బొమ్మై తెలిపారు. కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
Also Read:బసవరాజ్ బొమ్మై గురించి ఆసక్తికర విషయాలు.. టాటా మోటార్స్ లో మూడేళ్లు పని.. !
సీఎంగా బొమ్మై ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ట్వీట్పై ఆయన స్పందించారు. తనపై విశ్వాసం ఉంచిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో సుపరిపాలనను సమర్థవంతంగా, పారదర్శకంగా అందిస్తానని హామీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్ను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దాలన్న మోడీ విజన్ను కర్ణాటకలో సాకారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని బొమ్మై పేర్కొన్నారు.