
Karnataka minister Eshwarappa: కర్నాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై కేసు నమోదైంది. ఆయన అనుచరులు బసవరాజ్, రమేష్లపై కేసు నమోదైంది. మంత్రి 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారంటూ తన సూసైడ్లో లేఖలో సంతోష్ పాటిల్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. మంత్రి ఈశ్వరప్ప తనపై ఒత్తిడి తీసుకువచ్చారనీ, 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారంటూ తన సూసైడ్లో లేఖలో సంతోష్ పాటిల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మంత్రి ఈశ్వరప్పతో పాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు. అయితే ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని పోలీసులను కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశించారు.
కాగా, కాంట్రాక్టర్ సంతోష్ తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళుతున్నానని భార్యకు చెప్పి ఏప్రిల్ 11న బెల్గాం నుంచి వెళ్లాడు. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయాడు. మంగళవారం అతని మృతదేహం ఉడిపిలో శవమై కనిపించింది. ఉడిపి పట్టణంలోని ఓ లాడ్జిలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ శవమై కనిపించాడు. తన వద్ద నుంచి లంచం డిమాండ్ చేసిన మంత్రి, అతని సహాయకుల వల్లనే కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరుడు ప్రశాంత్ పాటిల్ ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మంత్రి ఈశ్వరప్పతో పాడు ఆయన అనుచరులు ఇద్దరిపై కేసు నమోదుచేశారు. దర్యాప్తును వేగవంతం చేశారు.
దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. మంత్రి కేఎస్ ఈశ్వరప్ప పై కేసు నమోదైందని తెలిపారు. ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని పోలీసులను సీఎం ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అంతా సేకరించానని సీఎం పేర్కొన్నారు. ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తల గురించి తెలియదని తెలిపారు. ఈశ్వరప్ప తనతో నేరుగా మాట్లాడినప్పుడే ఈ అంశాలపై స్పష్టత వస్తుందని సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.
"మంత్రి ఈశ్వరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నేను మొత్తం సమాచారం తీసుకుంటున్నాను. ఈశ్వరప్పతో ఫోన్లో మాట్లాడతాను.. అలాగే.. నేను అతనిని పిలిపించి నేరుగా మాట్లాడుతాను. ఈశ్వరప్పపై దాఖలైన ఎఫ్ఐఆర్పై హైకమాండ్కు వివరించాను" అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు.