కర్ణాటక ఉప ఎన్నిక ఫలితాల ఎఫెక్ట్: పీసీసీ చీఫ్ పదవికి గుండూరావు రాజీనామా

By sivanagaprasad KodatiFirst Published Dec 9, 2019, 7:23 PM IST
Highlights

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో దారుణ పరాజయాన్ని మూట కట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర నేతలు షాకిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్షనేత పదవికి మాజీ సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయగా, ఆయన బాటలోనే దినేశ్ గండూరావు నడిచారు. 

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో దారుణ పరాజయాన్ని మూట కట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర నేతలు షాకిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్షనేత పదవికి మాజీ సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయగా, ఆయన బాటలోనే దినేశ్ గండూరావు నడిచారు.

ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు.

Also Read:కర్ణాటక ఉప ఫలితాల ఎఫెక్ట్: సిద్ధరామయ్య రాజీనామా

అంతకుముందు సీఎల్పీ నేత పదవికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పును తాము గౌరవిస్తున్నామన్నారు.  ప్రతిపక్ష నేతగా తాను ప్రజాస్వామ్యానికి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలను పాటించాల్సి ఉంటుందని సిద్ధూ స్పష్టం చేశారు.

పార్టీలోని కొందరి సూచన మేరకు ప్రతిపక్షనేత పదవికి తాను రాజీనామా చేశానని, రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కేసీ వేణుగోపాల్‌, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూ రావుకు పంపారు.

ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేశానని అయితే ఫలితం మరోలా రావడంతో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సిద్ధూ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 

Also read:కర్ణాటక ఉప ఎన్నికలు: 12 చోట్ల బీజేపీ జయభేరీ, చేతులెత్తేసిన కాంగ్రెస్

కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. మొత్తం 15 స్థానాల్లో 12 గెలుచుకుని తనకు ఎదురులేదని నిరూపించుకుంది.

మరోవైపు, ఉప ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని అందుకోవాలని భావించిన కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. హస్తం పార్టీ కేవలం 2 చోట్ల మాత్రమే గెలిచి చేతులేత్తేసింది. 

click me!